ఆ వివాదంలో రేవంత్ ను చంద్రబాబు ఫాలో అవుతారా..!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఆదానీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఏపీ మాజీ సీఎం జగన్ కు ఆదానీ విద్యుత్ ఒప్పందాల కోసం ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఆదానీతో ఒప్పందాల పైన జేపీసీ కోసం కాంగ్రెస్ పార్లమెంట్ లో నిరసనలకు దిగింది. రేవంత్ సర్కార్ తమకు ఆదానీ ప్రకటించిన విరాళం తిరస్కరించింది. మరి.. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు. రేవంత్ నిర్ణయాన్నే ఫాలో అవుతారా..ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా..
ఆదానీ వివాదం వేళ
ఆదానీ ముడుపుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆదానీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒప్పందాల పైన చర్చ మొదలైంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సెకీతో ఒప్పందాల కోసం ఆదానీ ముడుపులు చెల్లించారని అమెరికా కోర్టులో అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ వివాదం రాజకీయంగా దుమారానికి కారణమైంది. తాము కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని..ఆదానీతో కాదని వైసీపీ చెబుతోంది. తమ హయాంలో సెకీతో చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబు రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం పైన ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాతో పాటుగా జాతీయ స్థాయిలో బీజేపీ మూడ్ కు అనుగుణంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

రేవంత్ నిర్ణయంతో
జగన్ ను టార్గెట్ చేస్తూనే..బీజేపీతో సమస్యలు రాకుండా ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యవహారం పైన ఎక్కడా కూటమి నేతలు తమ ఆలోచన స్పష్టం చేయలేదు. తాజాగా ఢిల్లీలో స్పందించిన పవన్ ఈ వ్యవహారం చంద్రబాబు అధ్యయనం చేస్తున్నారని మాత్రమే చెప్పుకొచ్చారు. అటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదానీ ముడుపుల వ్యవహారం వేళ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తమకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ సంస్థలు ప్రకటించిన రూ 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిధులు తమకు పంప వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదానీ గ్రూపు కు లేఖ రాసింది. దీంతో, ఇప్పుడు ఏపీలోనూ చర్చ మొదలైంది.

చంద్రబాబు ఏం చేస్తారు
విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో అనేక మంది ఏపీ ప్రభుత్వానికి సహాయక చర్యల కోసం భారీగా నిధులు ఇచ్చారు. ఆ సమయంలోనే అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25కోట్లు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించారు. ఇప్పుడు ఆదానీ పైన ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. జగన్ కు ముడుపులు ఇచ్చారనే అంశం పైన దుమారం చెలరేగుతోంది. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి వచ్చిన ఆదానీ విరాళం తిరస్కరించారు. దీంతో, సీఎం చంద్రబాబు సైతం రేవంత్ తరహాలోనే తమ ప్రభుత్వానికి వచ్చిన ఆదానీ విరాళం తిరస్కరిస్తారా అనే చర్చ మొదలైంది. ఆదానీ విరాళం చంద్రబాబు తిరస్కరిస్తే..రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, మరి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications