తూగోలో జగన్కు మరో ఝలక్: 20న టిడిపిలోకి ఆది, బాబు ఓకే
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు షాకివ్వాలనే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.
జగన్కు మరో షాక్: సైకిల్ ఎక్కే యోచనలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి..!
పార్టీలోకి వచ్చేందుకు, ఆయనకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పచ్చ జెండా ఊపారని చెబుతున్నారు. చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఏం చేయలేదని చెబుతూ వైసిపి నేతలు రెండు రోజుల క్రితం గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదే సమయంలో, గోదావరి జిల్లాలో కీలక నేత పార్టీని వీడాలని దాదాపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సైకిల్ ఎక్కే విషయమై ఆయన టిడిపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఈ నెల 20వ తేదీన సైకిల్ ఎక్కేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు.
లేదండటే ఈ నెల చివరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఆదిరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న జిల్లాకు చెందిన టిడిపి నేత గన్ని కృష్ణకు ఇప్పటికే పార్టీ వర్గాలు నచ్చ చెప్పాయని తెలుస్తోంది. ఆదిరెడ్డి ఎంట్రీకి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఆదిరెడ్డి మంతనాలు సాగిస్తున్నారట.