అత్యంత సంపన్నుడు జగన్: ఆ 9 మంది పైన తీవ్రమైన నేరాభియోగాలు : అప్పుల్లోనూ వారే ఉన్నారు..!
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో అత్యంత సంపన్నుడు ఎవరు. ఎక్కువగా అప్పుల్లో ఉన్నదెవరు. అదే విధంగా ఎవరి మీద ఎన్ని కేసులున్నాయి. తీవ్ర నేరాభియోగాలు ఉన్నవారెవరు. ఇటువంటి చర్చ కొద్ది రోజులుగా ఆస్తి కరంగా మారింది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో అభివృద్ది నిలిచిపోతుందని..వారికి పాలన రాదని..అనుభవం లేదంటూ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత తమ పాలనలో అవీనీతికి ఆస్కారం లేదని జగన్ తేల్చి చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వంలో ప్రముఖల గురించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆసక్తి కర అంశాలు వెలుగులోకి తీసుకొచ్చింది.
అత్యంత సంపన్నుడుగా జగన్..
ఏపీలో ముఖ్యమంత్రితో పాటుగా 25 మంది మంత్రులు ఉన్నారు. వీరి ఆస్తులు..అప్పులు..వీరి పైన నమోదైన కేసుల గురించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ పరిశోధన చేసింది. అందులో అనేక ఆసక్తి కర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆ సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొత్తం కేబినెట్లోనే అత్యంత సంపన్నుడుగా నిలిచారు. ఆ లెక్కల ప్రకారం తొలి స్థానంలో ముఖ్యమంత్రి జగన్ తన ఆస్తి 510 కోట్ల రూపాయాలతో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా, ఆయన ఆస్తి రూ. 130 కోట్లుగా ఉంది. ఇక, మూడవ స్థానంలో నెల్లూరు జిల్లా నుండి ఏపీ కేబినెట్లో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి రూ.61 కోట్ల ఆస్తులతో తరువాతి స్థానంలో నిలిచారు. మొత్తం జగన్ తో సహా కేబినెట్లో ఉన్న 26 మందిలో 88 శాతం మంది కోటీశ్వరులే. వారి సగటు ఆస్తి విలువ రూ.35.25 కోట్లుగా సంస్థ అంచనా వేసింది.
అవినీతి కేసుల్లో వారు ఇలా..
ఇక ఏపీ మంత్రివర్గంలో ఉన్న 25 మంది మంత్రుల్లో 17 మంది మీద క్రిమినల్ కేసులు ఉ్నట్లుగా సంస్థ నిర్ధారించింది. అందులో తొమ్మది మంది మీద అంటే కేబినెట్లో దాదాపు 35 శాతం మంది మంత్రుల పైన తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని సంస్థ వివరించారు. వీరంతా తమ మీద పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు..తమ మీద రిజిస్టర్ అయిన కేసులతో పాటుగా నమోదైన అభియోగాల గురించి తమ ఎన్నికల అఫిడవిట్ల సమయంలో వివరించారు. ఈ సంస్థ ఈ జాబితాలో ఎవరు ఉన్నారనే అంశం మీద మాత్రం పేర్లు బయట పెట్టలేదు. ఇక, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి పైన గతంలో టీడీపీ హాయంలో నమోదు అయిన కేసులూ ఉన్నాయి. అయితే తీవ్ర నేరాభియోగాలు అంటే అవి ఏ సెక్షన్ల కింద నమొదయ్యాయి.. ఎటువంటి కేసులు ఉన్నాయనే అంశం మీద ఇప్పుడు చర్చ మొదలైంది. సంస్థ సంఖ్య మినహా మంత్రుల పేర్లు వెల్లడించలేదు. దీంతో..ప్రస్తుతం వారు ఎవరనే చర్చ ఆసక్తి కరంగా మారింది.
అప్పుల్లోనూ ఆయనే సీనియర్..
ఇప్పుడు కేబినెట్లో ముఖ్యమంత్రి తరువాత ఉన్న మంత్రుల్లో ఎక్కవ సార్లు అసెంబ్లీకి ఎన్నికైంది పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి. ఆయన ఆస్తుల విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ తరువాతి స్థానంలో నిలిచారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ.130 కోట్లు తన ఆస్తుల విలువగా చూపించారు. ఇక, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఏపీ కేబినెట్లో ఎవరికి ఎక్కువ అప్పులు ఉన్నాయనే అంశం మీద వివరాలు సేకరించింది. వారిచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అందరి కంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రూ. 20 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు తేలింది. తరువాతి స్థానం లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజుకు రూ.12 కోట్ల మేర అప్పుటు..అదే విధంగా అవంతి విద్యా సంస్థల అధినేత..మంత్రి అవంతి శ్రీనివాసరావుకు రూ.5 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ లెక్కలను బహిర్గతం చేసింది.