రాష్ట్ర పరిధిలోనే కాపు రిజర్వేషన్లు-రాజ్యసభలో మరోసారి స్పష్టం-జగన్ స్పందించాలన్న జీవీఎల్
గతంలో ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. దాంతో రిజర్వేషన్ల వ్యవహారం అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రం క్లారిటీ కోరుతూ రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ వరుసగా కేంద్ర మంత్రులకు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో వారు వరుసగా ఇస్తున్న సమాధానాల్లో ఓబీసీ రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ మరోసారి అదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాపు రిజర్వేషన్ బిల్లు అంశంపై, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సామాజిక న్యాయం, సాధికారత, హోం మంత్రిత్వ శాఖల నుంచి సమాధానాలు కోరారు. దీంతో ఈ రెండు మంత్రిత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఓబీసీ రేజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నది కాబట్టి ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ఓబీసీ జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ, 04.04.2019న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన కాపు OBC బిల్లు, 2017ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం లోని రెండు మంత్రిత్వ శాఖలు స్పష్టం చేసాయి. రాష్ట్రంలో 50 శాతానికి మించిన మరాఠా ఓబీసీ రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మరింత క్లారిటీ ఇచ్చింది.
కాపు ఒబిసి రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలపై ఎంపీ జీవీఎల్ స్పందించారు. టిడిపి, వైసీపీ రెండు పార్టీల ప్రభుత్వాలు కాపు సామాజికవర్గాన్ని తప్పుదోవ పట్టించాయని ఆయన ఆరోపించారు. కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని తప్పుడు ప్రచారం చేశాయన్నారు. ఈ విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉందని పార్లమెంటు స్పష్టంగా తెలియ చేసిందని ఆయన వెల్లడించారు.
పార్లమెంటులో కేంద్ర ప్రభత్వం తన ప్రశ్నలకు సమాధానమిస్తూ స్పష్టత ఇచ్చిన సందర్భంగా, గతంలో కేంద్రానికి అనవసరంగా పంపిన కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు, 2017ను కేంద్రం నుంచి వెంటనే ఉపసంహరించుకుని, కాపులకు బీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తక్షణం స్పష్టం చేయాలని, కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేసారు.