ఎమ్మెల్సీ ఎన్నికల వేళ- జగన్ను కలిసిన కుడిపూడి: మెగాస్టార్ కు సన్నిహితుడు?
రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఇప్పుడిప్పుడే ప్రకటిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శెట్టిబలిజ నాయకుడు కుడిపూడి సూర్యనారాయణ రావు ఇవ్వాళ స
అమలాపురం: రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోన్నాయి.

సెమీ ఫైనల్స్..
2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ పోల్స్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ సాయంత్రం జరిగిన వైఎస్ఆర్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రత్యేకంగా ప్రస్తావించారంటే- దీన్ని ఆయన ఏ స్థాయిలో తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు.

స్థానిక సంస్థల్లో..
మొత్తం 14 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో రెండు ఉపాధ్యాయులు, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన తొమ్మిది కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన కోటాకు చెందినవి. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 90 శాతం వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఉన్న నేపథ్యంలో ఈ కేటగిరీలో ఎన్నిక ఏకపక్షంగా మారడానికే అవకాశాలు ఉన్నాయి.

అభ్యర్థుల ఎంపిక కోసం..
ఈ తొమ్మిది స్థానాల కోసం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది వైసీపీ అగ్ర నాయకత్వం. జిల్లాలవారీగా ఆశావహులు జగన్ ను కలుసుకుంటోన్నారు. అనంతపురం, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలుక చెందిన నాయకులు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్నారు.

జగన్ తో భేటీ..
ఈ పరిణామాల మధ్య తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కుడిపూడి సూర్యనారాయణ రావు కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక సంస్థల కోటాలో తూర్పు గోదావరి జిల్లా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆయన ఆశిస్తోన్నట్లు చెబుతున్నారు.

పీఆర్పీ తరఫున..
కుడిపూడి సూర్యనారాయణ రావుకు మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితుడనే పేరుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. తాజాగా- శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ- జగన్ ను కలుసుకోవడం చర్చనీయాంశమైంది.

టీడీపీ ఖాతాలో..
ప్రస్తుతం స్థానిక సంస్థలకు చెందిన ఈ తొమ్మిది స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. అనంతపురం నుంచి దీపక్ రెడ్డి, కడప నుంచి బీటెక్ రవి, నెల్లూరు- వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి-అంగర రామ్మోహన్ రావు, మంతెన సత్యనారాయణ రాజు, తూర్పు గోదావరి-చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం- శత్రుచర్ల విజయరామ రాజు, చిత్తూరు- రాజనర్సింహులు, కర్నూలు-కేఈ ప్రభాకర్ పదవీ కాలం ముగుస్తుంది.












Click it and Unblock the Notifications