నేటి నుంచే టీడీపీ మహానాడు - 2024 ఎన్నికలకు సమరశంఖం : పోలిట్ బ్యూరో ఆమోదం..!!
పసుపు పండుగకు సర్వం సిద్దమైంది. టీడీపీ మహానాడుకు ఒంగోలు పసుపుమయంగా మారింది. ఈ రోజు...రేపు టీడీపీ మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తో సహా పార్టీ ముఖ్యులంతా ఒంగోలు చేరుకున్నారు. మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. పలు జిల్లాల నుంచి కార్లు, ద్విచక్రవాహనాలపై కార్యకర్తలు భారీగా ఒంగోలుకు చేరుకుంటున్నారు.ఈ రెండు మహానాడులో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం కానుంది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు వర్చ్యువల్ మహానాడు నిర్వహించారు.
17 తీర్మానాలు - ఆమోదం
ఈ సారి మహానాడులో తొలి రోజున 10 వేల మందితో ప్రతినిధుల సభ జరగనుంది. అదే సమయంలో 17 తీర్మానాలు ఆమోదించనున్నారు. రెండో రోజు రేపు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభించటంతో పాటుగా 10 వేల మందితో సభ ఏర్పాటు చేసారు. ఇక, ఈ రోజు ప్రతిపాదించే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరోలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఇటు మహానాడు జరుగుతున్న సమయంలోనే అటు వైసీపీ మంత్రులు ప్రారంభించిన బస్సు యాత్ర పైన పోలిట్ బ్యూరోలో చర్చించారు.
బస్సు యాత్ర డ్రామా.. రాజ్యసభ ఎంపీలపైనా
బస్సు యాత్ర ఓ డ్రామా గా నేతలు అభివర్ణించారు. ఇక, వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారం పైన ఇందులో చర్చ జరిగింది. 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రెడ్డి వర్గం వారేనని నేతలు గుర్తుచేశారు. లాబీయింగ్ చేసేవారికి రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కళా వెంకట్రావు ప్రస్తావించారు. ఎంబీసీ నుంచి కొత్తవారికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు. ఇక, మహానాడు వేదికగా రాజకీయ తీర్మానంలో ఏ అంశాలు ఉంటాయి..అధినేత తన ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధమని తెదేపా అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. పార్టీ కేడర్నూ సమాయత్తం చేస్తున్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దీటుగా ఎదుర్కొనేలా, పార్టీ కేడర్ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఇప్పుడు మహానాడు జరగనుంది. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మహానాడు నిర్వహణలోను యువతరానికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువతను ఆకర్షించే విధంగా చంద్రబాబు పార్టీ మహానాడు వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు. సీనియర్ల అనుభవాన్ని, కొత్తతరం ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ.. పార్టీ పరంగా అన్నింటా యువతకు ప్రాధాన్యత దక్కేలా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో.. సామాజిక సమతుల్యత - 2024 ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఈ సారి మహానాడు 2024 ఎన్నికలకు..రాజకీయంగా టీడీపీకి కీలకంగా మారనుంది.