రైతులపై చేయి వేస్తే సహించం: అంబటి హెచ్చరిక
హైదరాబాద్: రాజధాని గ్రామాల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని, ఇవ్వని రైతులను వదిలేయాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు.
రాజధాని గ్రామాల్లో దుశ్చర్యపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు.
రాజధాని రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘటన పాల్పడి ఉంటారని అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యమా?రాక్షస పాలనా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు.
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు సృష్టించడాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ఖండించారు. ఈ చర్యను అరాచక చర్యగా అభిప్రాయపడ్డ రావెల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం రాజధాని గ్రామాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు, ఎస్పీ రాజశేఖర్ బాబులు పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు.