అమరావతిలో సెకండ్ ఇన్నింగ్స్.. శాశ్వత భవనాల నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్
అమరావతి : పరిపాలనను వీలైనంత త్వరగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చేయాలనుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. అనుకున్న విధంగానే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి ఉద్యోగులను తరలించిన విషయం తెలిసిందే. తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయిపోవడంతో.. తాజాగా శాశ్వత భవనాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఒకవిధంగా రాజధాని నిర్మాణంలో ఇదో సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. రెండో దఫా చేపట్టబోతున్న ఈ నిర్మాణాల్లో.. మొత్తం 950 ఎకరాల్లో రాజ్ భవన్, సీఎం కార్యాలయం, శాశ్వత సచివాలయం, మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇతర ప్రభుత్వ భవనాలను నిర్మించనుంది ప్రభుత్వం. ఇందుకోసం అమరావతి పరిధిలోని రాయపూడి, లింగాయపాలెం రెవెన్యూ పరిధిని పూర్తిగా, అలాగే ఉద్ధండ్రాయునిపాలెం, కొండమరాజుపాలెంలో కొంతమేర భూములను నిర్మాణాల కోసం ఉపయోగించనున్నారు.
శాశ్వత భవనాల ఏర్పాటుకు సంబంధించిన పనులకు ఈ నెల 28న శంకుస్థాపన చేయనుంది ప్రభుత్వం. శంకుస్థాపన కార్యక్రమాని సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్నట్లుగా సమాచారం. పనులను సీర్డీఏ కమిషనర్ సమీక్షిస్తున్నారు.