నారా లోకేష్ కు అమరావతి రైతు అదిరిపోయే బహుమతి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అమరావతి ప్రాంతానికి చెందిన యువ రైతు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కౌలుకు తీసుకున్న పొలంలో లోకేష్ ఫొటో రూపంలో వరిపంట పండించాడు. ఎకార పొలం కౌలుకు తీసుకున్న ఆ యువ రైతు.. 70 సెంట్ల స్థలంలో లో లోకేష్ ఫొటో రూపంలో వరి పండించాడు. ఈ నెల 23న లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పండించిన వరి ధాన్యాన్ని లోకేష్కు బహుమతిగా అందించనున్నట్లు వెల్లడించారు.
ఉద్దండరాయునిపాలెంకు చెందిన పులి చిన్నా
తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్నాకు లోకేష్ అంటే చాలా అభిమానం. లోకేష్ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటాలని కొత్తగా ఆలోచించాడు. చిన్నా అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నాడు. లోకేష్ పట్ల తనకున్న అభిమానాన్ని ఇలా పంట రూపంలో చాటుకున్నానని చిన్నా చెబుతున్నాడు. కుప్పం నుంచి ప్రారంభం కాబోతున్న పాదయాత్ర విజయవంతమవ్వాలని పచ్చని పంటద్వారా శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు తెలిపారు. లోకేష్ జన్మదినోత్సవాన్నిపురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

డీజీపీకి లేఖ రాసిన వర్ల రామయ్య
ఈనెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. తన తండ్రి సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు నడవబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాన్నింటినీ కవర్ చేయనున్నారు. పాదయాత్రకు అనుమతివ్వాలంటూ పార్టీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. పాదయాత్రకు ఎన్ని కార్లు వస్తాయి? ఎంతమంది ప్రజలు వస్తారు? లాంటివన్నీ వివరాలివ్వమంటే ఎలా సాధ్యపడుతుందని పార్టీ మరో నేత బొండా ఉమ మండిపడ్డారు.

అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా జరుగుతుంది..
పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభమవుతుందని, అందులో మార్పు లేదని పార్టీ నేతలు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎంతమంది వస్తారు? నెంబరు చెప్పండి అంటే ప్రభుత్వంపై వ్యతిరేకతతో వచ్చేవారు ఎంతమందో ఎవరు చెప్పగలరని బొండా ఉమ ప్రశ్నించారు. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల పాదయాత్రకు ఎలాంటి అనుమతులిచ్చారో అవే ఇవ్వాలంటూ ఉమ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications