ఢిల్లీ కేంద్రంగా అమరావతి రైతుల ఆందోళన: జాతీయ నేతలను కలిసి..: ఇదీ కార్యాచరణ..!
రాజధాని తరలింపు ప్రతిపాదనలతో రోడ్డెక్కిన అమరావతి రైతులు..ఇప్పుడు ఢిల్లీ వేదికగా తమ నిరసనలు కొనసాగించటానికి సిద్దమవుతున్నారు. గత 13 రోజులుగా అమరావతి పరిసర గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి..అక్కడ జాతీయ నేతలను కలవాలని నిర్ణయించారు.
ఢిల్లీ కేంద్రంగా కుటుంబ సభ్యులతో సహా నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకు న్నారు. దీని కోసం అక్కడ అనుమతులు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రధాన పార్టీల కీలక నేతల అప్పాయింట్ మెంట్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతికి తమ ఆవేదన గురించి నివేదించిన రైతులు.. ప్రధానిని కలిసేందుకు తమకు అవకాశం ఇప్పించాలని బీజేపీ నేతలను అభ్యర్ధిస్తున్నారు. దీంతో..ఇక రైతుల పోరాటం జాతీయ స్థాయికి వెళ్లనుంది.
రామ్ లీలా మైదానంలో నిరసన..
రాజధాని రైతులు తమ ఆందోళనలో భాగంగా జనవరిలో ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా తమ బాధను దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకూ తెలిసేలా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఉప రాష్ట్రపతిని కలిసి రాజధాని తరలించకుండా చూడాలని అభ్యర్ధించారు. ఈ వ్యవహారంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
దీంతో ఉద్యమాన్ని విస్తృతం చేయడం ద్వారా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. జనవరిలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహిళలు, చిన్నారులందరితో కలిసి వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన అనుమతులను తీసుకునే పనిలో నిమగమయ్యారు. ఢిల్లీలో నిరసన చేపట్టం ద్వారా.. ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి..రాజధాని తరలింపు ఆలోచన పెండింగ్ లో పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జాతీయ నేతలను కలిసేందుకు..
ఇప్పటికే అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు ఢిల్లీలోని ఇద్దరు కీలక వ్యక్తులతో ఈ మొత్తం వ్యవహారం పైన సంప్రదింపులు చేస్తున్నారు. జాతీయ పార్టీల నేతలను కలిసి తమ ఆవేదన వినిపించాల ని భావిస్తున్నారు. ఇందు కోసం వారి సమయం కోరారు. జాతీయ పార్టీల నేతలు ఇచ్చే సమయానికి అనుగుణంగా ఢిల్లీలో దీక్ష తేదీ ఖరారు చేయనున్నారు. మహిళలు..పిల్లల ద్వారా దీక్ష చేయటం ద్వారా తమకు జాతీయ స్థాయిలో అందరూ తమ సమస్య పైన ఫోకస్ చేస్తారని చెబుతున్నారు.
ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం సైతం రైతులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాను ల తరలింపు..అమరావతి ఆందోళన అంశం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. ఇప్పుడు తామే నేరుగా రాజధానిలో కార్యాచరణ ఫిక్స్ చేయటం ద్వారా తమ ప్రయత్నాలు ఫలిస్తాయని రైతులు భావిస్తున్నా రు.