ఏపీలో ఆ విద్యార్థులకు తీపికబురు.. కొత్తగా మరో 10 గురుకులాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ముఖ్యంగా బీసీ విద్యార్థుల విద్యా అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త గురుకులాల ఏర్పాటుతో మొత్తం 4,800 అదనపు సీట్లు విద్యార్థులకు లభించనున్నాయి. ఈ విద్యా సంవత్సరం 2026-27నుంచే ఈ గురుకులాలు ప్రారంభం కానున్నాయి.
10 గురుకులాలు నిర్మించే నిర్ణయం
ప్రస్తుతం ఈ గురుకులాలను అద్దె భవనాల్లో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత స్వంత భవనాల నిర్మాణం చేపట్టనుంది. ఈ 10గురుకులాల్లో 5 బాలికల గురుకులాలు మరియు 5 బాలుర గురుకులాలు ఉంటాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీరికి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించనున్నారు. మొదటి సంవత్సరం ప్రతి గురుకులంలో 240 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. 2027-28 విద్యాసంవత్సరం నుంచి ప్రతి గురుకులంలో సీట్ల సంఖ్యను 480కి పెంచనున్నారు.

ఈ జిల్లాలలోనే గురుకులాలు
ఈ గురుకులాలను ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేశారు.
శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల (బాలికలు)
అనకాపల్లి జిల్లా: నక్కపల్లి (బాలికలు)
పల్నాడుజిల్లా: మాచర్ల (బాలికలు)
మంత్రాలయం (బాలికలు)
అనంతపురం జిల్లా: గుంతకల్లు (బాలికలు)
అన్నమయ్య జిల్లా: రాయచోటి (బాలురు)
మార్కాపురం జిల్లా: గిద్దలూరు (బాలురు)
కర్నూలు జిల్లా: పత్తికొండ (బాలురు),
శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ (బాలురు),
కదిరి (బాలురు) గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు.
మొదటి విడతగా 10 గురుకులాలకు అనుమతి
పెనుకొండ, పత్తికొండలో ఇప్పటికే బీసీ గురుకులాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో బీసీ గురుకులాలు లేని చోటే కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ మొదట 20 గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మొదటి విడతగా 10కి అనుమతి లభించింది.కొత్త గురుకులాల ఏర్పాటుతో బీసీ హాస్టల్స్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆ హాస్టల్స్ విద్యార్థులందరినీ గురుకులాల్లో
బీసీ హాస్టల్స్లో 10 నుంచి 30 మంది విద్యార్థులు ఉండే ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆ హాస్టల్ విద్యార్థులందరినీ గురుకులాల్లో చేర్చుతారు. ఈ ఏడాదికి మాత్రం రూ.13 కోట్ల 60 లక్షలు బీసీ వసతి గృహాల నిర్వహణకు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఈ కొత్త గురుకులాలు వస్తున్నాయి. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఉజ్వలం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం బీసీ సమాజాల్లో ఆనందం సృష్టించింది.












Click it and Unblock the Notifications