సుప్రీంకోర్టులో కీలక దశకు చేరిన అమరావతి
అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు నిరాశే ఎదురైంది. వాస్తవానికి సుప్రీంకోర్టులో రాజధాని కేసు మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. కానీ బెంచ్ ఇతర కేసుల్లో బిజీగా ఉండటంవల్ల విచారణకు రాలేదు. ఎప్పుడు జరుగుతుందనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఈ కేసులో ఇప్పటికే 261 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. వారంతా తమ తమ అఫిడవిట్లను ఇంకా దాఖలు చేయలేదు. ఎంతమంది దాఖలు చేశారు? ఎంతమంది ఇంకా పెండింగ్ లో ఉన్నరన్న విషయంపై కూడా స్పష్టత లేదు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ను దాఖలు చేయాల్సి ఉంది.
ఏపీలో భారతీయ జనతాపార్టీ నేతలు మాత్రం అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తున్నారు. కేంద్రం అమరావతికిచ్చిన నిధుల జాబితాను కూడా చదువుతున్నారు. కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు కేసు విచారణకు వచ్చేరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా విశాఖ రాజధాని అని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు బెంచ్ కి రాలేదు.
ఆరునెలల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న అంశంపై స్టే ఇచ్చారు. జనవరి 31వ తేదీ వరకే ఈ స్టే విధించారు. సుప్రీంలో కేసు విచారణకు రాకపోవడంతో స్టే ఉంటుందా? ఉండదా? అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. అమరావతి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయిన తర్వాతే ఏ విషయంలోనైనా స్పష్టత రానుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా రాజధాని విశాఖపట్నం అని, త్వరలోనే తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన తాజాగా ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది.