నాడు వైఎస్ జగన్ కేసులో లక్ష్మీనారాయణ..నేడు చంద్రబాబు కేసులో అదే లక్ష్మీనారాయణ
అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విచారణకు హాజరయ్యే తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నోటీసుల్లో పొందుపరిచినట్టుగా ఈ నెల 23వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణను ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ కేసులో మరో పురోగతి కనిపించినట్లు సమాచారం. విచారణాధికారిని కూడా నియమించినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు ఏం చేయబోతున్నారు? న్యాయ నిపుణులతో మంతనాలు: మరో స్టే కోసమేనా?
అమరావతి భూముల కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో విచారణాదికారిగా ఏ లక్ష్మీనారాయణ రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ సీఐడీ సైబర్ సెల్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. చంద్రబాబుకు జారీ చేసిన నోటీసులపై ఆయనే సంతకం చేశారు. 15వ తేదీ నాడే నోటీసులు సిద్ధం అయ్యాయి. తనకు నోటీసులు అందినట్లు చంద్రబాబు కూడా సంతకం చేశారు. తన సంతకం కింద 16వ తేదీని వేశారు.
ఇదివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం కేసును సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి చంద్రబాబుపై నమోదైన అమరావతి భూముల కుంభకోణం కేసులో ఏ లక్ష్మీనారాయణ రావు దర్యాప్తును చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలోని ఏపీ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టంగా పొందుపరిచారు. వాటిపై చంద్రబాబు సంతకం చేసినందున.. విచారణకు హాజరు కావడం తప్పకపోవచ్చని అంటున్నారు.
ఈ లోగా స్టేను తెచ్చుకోవడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారని చెబుతున్నారు. స్టేను కోరుతూ ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని సమాచారం. దీనికి అవసరమైన ప్రక్రియను ఎలా చేపట్టాలనే విషయంపై ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు మొదలు పెట్టారు. విచారణకు హాజరు కాకుండా ఉండే విషయంలో ఎలా ముందుడుగు వేయాలనే విషయంపై మంతనాలు సాగిస్తున్నారు. తనపై నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా ఆయన తరువాతి చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.