మళ్లీ మొదలైన అమరావతి పాదయాత్ర ? వారం క్రితమే రహస్యంగా ! ఈసారి వన్ మ్యాన్ షోగా..!
ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పుతో దాన్ని ముందుకు తీసుకెళ్లలేని స్ధితిలో ఉంది. అదే సమయంలో ప్రభుత్వంపై ఒకే రాజధాని కోసం ఒత్తిడి పెంచేందుకు రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి ఆలయానికి అమరావతి మహాపాదయాత్ర 2.0 ప్రారంభించారు. అయితే వైసీపీ సర్కార్ అడ్డంకులతో పాటు వివిధ కారణాలతో అది కాస్తా నిలిచిపోయింది. అది తిరిగి ఇప్పుడు ప్రారంభమైంది.
అమరావతి పాదయాత్ర పునఃప్రారంభం ?
అమరావతిలోనే ఏపీ రాజధానిని ఉంచాలని, మూడు రాజధానులు కాకుండా ఒకే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్ర గతంలో కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిచిపోయింది. తాజాగా అది మళ్లీ మొదలైంది. అయితే ఈసారి పాదయాత్రలో కొన్ని విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఈ పాదయాత్ర అందరికీ తెలిసేలా, ప్రచారంతో కాకుండా సైలెంట్ గా సాగిపోతోంది. దీంతో ఈ పాదయాత్ర వ్యవహారం తాజాగా బయటికి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లికి చేరుకోవాల్సిన ఈ యాత్ర ఇప్పటికే రామచంద్రపురం నుంచి అనకాపల్లి వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది.
రహస్యంగా యాత్ర ?
గతంలో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర భారీ జన సందోహంతో, బ్యానర్లు, రథాలు, నినాదాలతో హంగామా సృష్టించింది. దీంతో దీనికి వ్యతిరేకంగా వైసీపీ ప్రజాప్రతినిధులు సాధారణ జనాన్ని రెచ్చగొట్టి మరీ ప్రతి నినాదాలు, నల్లబెలూన్లు, బ్యానర్లు ఎగరేసి తమ వ్యతిరేకత తెలిపారు. దీంతో ఈసారి పాదయాత్రను రహస్యంగానే కొనసాగిస్తున్నారు. ఈసారి ఎలాంటి ప్రచార హంగామా లేకుండా, టీవీల్లో ప్రచారం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఎవరికీ తెలియకుండానే తమ పని తాము చేసుకుపోతున్నారు. దీంతో ఈ యాత్ర గురించి ఎక్కడా చడీ చప్పుడు లేదు.
వారం క్రితమే మొదలు
అమరావతి పాదయాత్ర వారం రోజుల క్రితమే గతంలో ఆగిన రామచంద్రపురం నుంచే తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే యాత్ర సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందే రామచంద్రపురంలో తిరిగి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పుడు కాకినాడ, అన్నవరం, తుని మీదుగా అనకాపల్లి వరకూ చేరుకున్నట్లు తెలిసింది. ఇది త్వరలో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లికి చేరుకున్న తర్వాత అన్ని వివరాలు బయటికి తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వన్ మ్యాన్ షోగా ?
గతంలో దాదాపు వెయ్యి మంది వరకు రైతులతో కొనసాగిన రైతుల పాదయాత్ర ఈసారి మాత్రం వన్ మ్యాన్ షోగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ గా ఉన్న గద్దె తిరుపతిరావు ఈ యాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. గతంలో అమరావతి రైతులతో కలిసి పాదయాత్ర చేసిన తిరుపతిరావు ఈసారి మాత్రం తాను ఒంటరిగానే యాత్ర చేస్తున్నారు. అరసవిల్లికి చేపట్టిన యాత్ర కావడంతో మధ్యలో ఆపకూడదనే సెంటిమెంట్ తో ఆయన దీన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరికీ ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు, వైసీపీ ప్రభుత్వం దీన్ని కూడా అడ్డుకుంటుందనే భయంతోనే ఇలా చేస్తున్నారా, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవడంతో తనను అరెస్టు చేస్తారనే ఇలా ఎలాంటి ప్రచారం లేకుండా తిరుపతిరావు యాత్ర కొనసాగిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.