రాజధానిగా అమరావతిపై సుప్రీంకోర్టులో..: మరో కీలక పిటీషన్ దాఖలు..!!
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 31వ తేదీన చేపట్టనుంది. ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే నిలిచింది.
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షానికి వచ్చింది ఈ పిటీషన్. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరమని వ్యాఖ్యానించారు.
రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నిర్ధారించడానికి న్యాయస్థానాలేమీ టౌన్ ప్లానింగ్ ఆఫీసులు కావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రాజధాని నగరాన్ని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందా? అంటూ పిటీషనర్ల తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం.
ఈ పరిణామాల మధ్య ఇదే అంశంపై తాజాగా మరో పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి దీన్ని దాఖలు చేశారు. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధాని నగరాన్ని నిర్దారించడానికి అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ఒకేచోట రాజధాని నగరం సరైంది కాదంటూ కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీ సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నగరం వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించినప్పటికీ- దాన్ని పట్టించుకోలేదు. అక్కడే అమరావతిని ప్రకటించారు. ఈ విషయాన్ని కూడా పిటీషన్.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే దాఖలైన పిటీషన్లతో కలిపి దీన్ని కూడా విచారణకు స్వీకరించేు అవకాశం ఉంది.
ఢిల్లీలో ప్రభల తీర్థం- కోనసీమ సంస్కతికి అద్దం పట్టేలా..!!