మీ కాళ్ళు పట్టుకుంటా, ఆ కేసులు వెనక్కు తీసుకోండి: అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరి వల్ల అనకాపల్లి అభివృద్ధి ఆగిపోకూడదు అని, అవసరమైతే కోర్టును ఆశ్రయించిన వారి కాళ్లు పట్టుకుంటాను అని ఇప్పటికైనా కేసులు ఉపసంహరించుకోవాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తిచేశారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలను సాకుగా చూపి కోర్టుల నుంచి స్టేలు తీసుకు రావడం సరికాదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

సాంకేతిక లోపాలను సాకుగా చూపించి కోర్టుల నుండి స్టేలు
అనకాపల్లికి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని, ఆసుపత్రిని మంజూరు చేయిస్తే సాంకేతిక లోపాలను సాకుగా చూపించి కోర్టుల నుండి స్టేలు తీసుకు వచ్చి ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్, ఇలాంటి ఇబ్బందులు పెట్టొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఉన్నతమైన జిల్లాగా అనకాపల్లిని తీర్చిదిద్దుతామని, అనకాపల్లిని కనకవల్లి గా మారుస్తామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. సముద్రతీరం, జాతీయ రహదారి, బెల్లం మార్కెట్, ఎస్.ఇ.జెడ్, ఫార్మాసిటీ ఇలా అనేక ప్రత్యేకతలు అనకాపల్లి జిల్లాకు సొంతమని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

భావితరాల భవిష్యత్ కోసం పని చేస్తున్నాం .. అభివృద్ధి అడ్డుకోకండి
ఎమ్మెల్యేగా తనకో, సీఎం జగన్మోహన్ రెడ్డి కో పేరు వస్తుందని తాము పని చేయడం లేదని, భావితరాల భవిష్యత్ కోసం పని చేస్తున్నామని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అలాంటి భావి తరాల భవిష్యత్ ను అడ్డుకోవద్దన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లిని జిల్లా కేంద్రంగా మార్చారు అని, వైయస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రకటించడం హర్షణీయమన్నారు.
నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయాలని కొందరు ఆందోళన చేస్తున్నారని, పెందుర్తి విశాఖలో కలపాలని అక్కడ ఎమ్మెల్యేలు కోరుతున్నారని పేర్కొన్న ఆయన అనకాపల్లి అభివృద్ధి చెందే సమయంలో, అనకాపల్లి జిల్లా కేంద్రం చేసినందుకు, మెడికల్ కాలేజ్ ను తమకే కేటాయించాలని వారు అంటున్నారని పేర్కొన్నారు.
Recommended Video

అన్ని వర్గాల వారిని కలుపుకొని త్వరలో సంఘీభావ ర్యాలీ
దేశంలోనే శరవేగంగా అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని, అందరికీ అందుబాటులో ఉంటుందని కనుక అనకాపల్లి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు అన్ని వర్గాల వారిని కలుపుకొని త్వరలో సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తామని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అనకాపల్లి అభివృద్ధి చెందుతున్న క్రమంలో కోర్టులు, కేసులు అంటూ అభివృద్ధిని అడ్డుకోవడం మంచిదికాదని వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications