ఆయనో అయస్కాంతం: చంద్రబాబుపై కేంద్రమంత్రి అనంతకుమార్ ప్రశంసలు
విశాఖపట్నం: కేంద్రమంత్రి అనంతకుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. భాగస్వామ్య సదస్సు మూడోరోజున ఆయన పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులను రాబట్టడంతో చంద్రబాబు అయస్కాంతం లాంటి వారని అనంతకుమార్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని ఫార్మా హబ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆశిస్తున్నారని తెలిపారు. అమరావతి నగరాన్ని నిర్మిస్తున్న ఆయన విశ్వకర్మ లాంటివారని కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసమే భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి అనంతకుమార్ స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్లో హెచ్పీసీఎల్, గెయిల్ సంయుక్తంగా రూ.30వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో రూ.600 కోట్లతో వంద ఎకరాల్లో జాతీయ ఫార్మా శిక్షణ, పిరశోధన సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో ప్లాస్టిక్ ఇంజినీరింగ్ హైలెవెల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి 5వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు.

బీచ్ల ఏర్పాటుకు ముందుకు రావాలి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని ఇచ్ఛాపురం నుంచి తడ వరకు అందమైన బీచ్ల ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మూడోరోజు భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. కోనసీమ ఓ అందమైన ప్రదేశమని అక్కడ టూరిజంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు.
అంతర్గత జలరవాణా మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజల ఆలోచనా విధానం మారిందని మెరుగైన వసతులు కోరుకుంటున్నారని తెలిపారు. విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications