విశాఖ ఉక్కు లక్ష కోట్లు: టీడీపీ కొంటుందా: ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించండి: పవన్కు సజ్జల
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి . విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఖచ్చితంగా ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోమారు స్పష్టం చేయడంతో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. తాజాగా నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటనతో ప్రతిపక్ష పార్టీలు అధికార వైసీపీపై మండిపడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డి అవాస్తవాలు మాట్లాడటం అలవాటు అయిందని మాజీ ఎంపీ సబ్బం హరి మండిపడ్డారు.
ఉక్కు పరిరక్షణ అందరిదీ..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సజ్జల అన్నారు. ఇందులో భాగంగా కేంద్రంపై రాజకీయపరమైన ఒత్తిళ్లను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని, అందుకోసమే ముఖ్యమంత్రి.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజల శరీరంలో ఓ భాగంగా మారిన విశాఖ ఉక్కును కాపాడుకోవడం వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది కుటుంబాల ఉపాధిని నిలబెట్టినట్టవుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఆస్తి..
విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తి మాత్రమేనని, దాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా.. లేక ప్రైవేటీకరించాలనుకున్నా.. దానికి బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అన్నారు. భౌగోళికంగా రాష్ట్ర భూభాగంపై దాన్ని నెలకొల్పడం మినహా.. మరెలాంటి హక్కులూ స్టీల్ ప్లాంట్పై ఉండదని చెప్పారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావాలనే విషయం మీద సలహాలు ఇవ్వగలమే తప్ప.. రాష్ట్రం చేయగలిగిందేమీ ఉండదని తేల్చి చెప్పారు.
లక్షన్నర కోట్ల విలువ..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విలువ 31 వేల కోట్ల రూపాయలుగా నిర్ధారించడం సరికాదని సజ్జల అన్నారు. ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం దాని విలువ లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, వాటి విలువే భారీగా ఉందని పేర్కొన్నారు. అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి కేంద్రం తక్షణ చర్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి..విలువను తగ్గించి మరీ ప్రైవేటీకరించడానికి సిద్ధపడిందని చెప్పారు.
పవన్ కల్యాణ్ సన్నాయి నొక్కులు..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దేశం కోసమే విక్రయిస్తున్నారంటూ బీజేపీ మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. దాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన పరిస్థితుల్లో పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని పంపించినట్టయిందని చెప్పారు. పవన్ కల్యాణ్కు కేంద్రంలో ఏ మాత్రం పలుకుబడి ఉన్నా..తమకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించగలరా? అని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ఈ విషయంలో మౌనం దాల్చడం ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు. దేశం కోసమే అమ్ముతున్నారంటూ తమ పార్టీని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ కొంటుందా?
నష్టాల్లో కూరుకుపోయిన హెరిటేజ్ను తాము లాభాల్లోకి తీసుకొచ్చామంటూ చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ చాలా సందర్బాల్లో చెప్పుకొన్నారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, లాభాల్లోకి తీసుకుని రావాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. విశాఖ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికే తప్ప నిజంగా దాన్ని పరిరక్షించే ప్రయత్నాన్ని టీడీపీ చేయట్లేదని విమర్శించారు. ఈ విషయంలో టీడీపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించాలని సజ్జల డిమాండ్ చేశారు. అఖిలపక్షం తరఫున ప్రధాని వద్దకు వెళ్లడానికి టీడీపీని కూడా ఆహ్వానించామని చెప్పారు.