జాతీయ స్థాయిలో పవన్ ఫార్ములా సత్ఫలితాలు: గుర్తించిన కేంద్రం
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామసభలను నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 13,326 పంచాయతీలు ఉండగా.. వాటన్నింట్లోనూ ఒకేరోజు ఒకేసారి గ్రామసభలను నిర్వహించేలా పవన్ కల్యాణ్ చర్యలను తీసుకున్నారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభలను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. దీనికి అవసరమైన విధి విధానాలపై ఆయన ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి పవన్ కల్యాణ్ అనుసరిస్తోన్న ఫార్ములా సత్ఫలితాలను ఇస్తోంది. నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనపరిచిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలకు ఈ నాలుగు ఎంపిక అయ్యాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సకత్ వికాస్ పురస్కార్ కింద ఈ అవార్డులను అందజేస్తోంది.
హెల్త్ కేటగిరీలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మ సముద్రం, సమృద్ధిగా నీటి వనరులు ఉన్న పంచాయతీల విభాగంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్లో అదే జిల్లాలోని తగరంపూడి, సామాజిక భద్రతలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల పంచాయతీలు ఎంపికయ్యాయి.
ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయా పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులు, ఇతర సిబ్బందిని అభినందించారు. సమీకృత అభివృద్ధిని సాధిస్తున్నామనడానికి ఈ పురస్కారాలే నిదర్శనమని అన్నారు. ఉన్నతాధికారులు మొదలుకుని గ్రామీణ స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు చిత్తశుద్దితో పనిచేయడం వల్లే ఇది సాధ్యపడిందని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications