వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పని.. వారిని హైకోర్టు మెట్లెక్కేలా చేస్తోందిగా: పిల్ దాఖలు చేసిన అడ్వొకేట్
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితులు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులను హైకోర్టు మెట్లెక్కేలా చేస్తోంది. లాక్డౌన్ సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేస్తున్నారని, వారిని అడ్డుకోవాలని కోరుతూ కిషోర్ అనే ఓ అడ్వొకేట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కొన్ని ఫొటోలను ఆయన తన పిటీషన్కు జత చేశారు. వారంతా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.
ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలపై..
ఆరు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేర్లను ఈ పిటీషన్లో పొందుపరిచారు. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్ రెడ్డి (శ్రీకాళహస్తి-చిత్తూరు జిల్లా), ఆర్ కే రోజా (నగరి-చిత్తూరు జిల్లా), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట-నెల్లూరు జిల్లా), వెంకట గౌడ (పలమనేరు-చిత్తూరు జిల్లా) విడదల రజినీ (చిలకలూరి పేట-గుంటూరు జిల్లా)లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా కొన్ని చట్టాలను ఆయా ఎమ్మెల్యేలంతా ఉల్లంఘించారని, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.
ఇంట్లోనే ఉండాలని లాక్డౌన్ నిబంధనలు సూచిస్తోన్నా
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోందని న్యాయవాది కిషోర్ తన పిల్లో గుర్తు చేశారు. అయినప్పటికీ..తాము ప్రజా ప్రతినిధులమనే కారణంతో ఆ ఎమ్మెల్యేలందరూ బాహ్య ప్రపంచంలోకి తిరుగుతున్నారని, బహిరంగ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కనీసం సోషల్ డిస్టెన్సింగ్ను కూడా పాటించకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమౌతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కరోనా పరీక్షలను నిర్వహించాలంటూ..
ఆయా ఎమ్మెల్యేలందరికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించేలా రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని విజ్ఙప్తి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతున్నారని, పోలీసులు కూడా వారికి అడ్దు చెప్పట్లేదని ఆరోపించారు. దీనిపై హైకోర్టు తక్షణమే స్పందించాలని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయాలని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తూ..
న్యాయవాది తన పిల్లో పొందుపరిచిన ఆరుమంది ఎమ్మెల్యేలు కూడా లాక్డౌన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరుగాడుతున్న వారే. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, నిత్యావసర సరుకుల పంపిణీ, కోడిగుడ్లు, కూరగాయలు, శానిటైజర్లను ప్రజలకు అందజేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో పోలీసులు, మున్సిపల్ అధికారులతో లాక్డౌన్ పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.