గుడ్న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. సంక్రాంతి నుంచి కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఆరోజు పీ4 కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయో అదే తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. డ్వాక్రా సంఘాలకు త్వరలోనే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ హోదా కల్పించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే వ్యక్తి గత రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు.
రాముడి తల తీస్తే చర్యలు లేవు
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామతీర్థంలో రాముడి తల తీసేస్తే ఎన్నికలు జరిగేవరకు దర్యాప్తు చేయలేదని, మూడు సింహాలను దొంగిలించినా స్పందన లేదన్నారు. అనంతపురంలో దేవుడి రథం తగలబెట్టి తెలుగుదేశం పార్టీమీద నెపం నెట్టారన్నారు. నేరస్తుల ఆటలు సాగనివ్వనని, ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటామన్నారు. నేరస్తులు, రౌడీషీటర్ల భరతం పడతామని హెచ్చరించారు. 2027 నాటికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు అందిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం పథకం జల్ జీవన్ మిషన్ ను ఉపయోగించుకుంటామన్నారు.

వరదలవల్ల వ్యాధులు రాకుండా చూశాను
బుడమేరు విజయవాడను ముంచేసినప్పుడు వరదలవల్ల వ్యాధులు రాకుండా అడ్డుకోగలిగామన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి రూ.450 కోట్ల విరాళాలు వచ్చాయని, తాను చేసిన పనికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటింటికీ వచ్చి చెత్తను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాను ఏమైనా చెబుతుందే చంద్రబాబు ఇలాగే చెబుతుంటాడులే అనుకుంటారని, తమకు ఓ పది రూపాయలు డబ్బులిస్తే చాలులే అనుకుంటున్నారని, కానీ తన ఆలోచనల్లా రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలబెట్టడమేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications