ఏపీ ఇంటర్ పరీక్షలు వాయిదా- ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కేంద్రం తయారు చేసిందని, కానీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు లేవని ప్రభుత్వం తెలిపింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించారని, మరికొన్ని రాష్టాల్లో త్వరలో జరగాల్సి ఉందన్నారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. అయితే పరీక్షలు రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్ధులకు మంచి మార్కులతో గ్రేడ్లతో సర్టిఫికెట్లు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో మన విద్యార్ధులు వెనుకబడకుండా చూడాల్సిన బాధ్యత ఓ మంచి ప్రభుత్వంగా తమపై ఉందని తెలిపింది. పూర్తిగా కరోనా నిబందనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్దమయ్యామని, ప్రాక్టికల్స్ కూడా అయిపోయాయి కాబట్టి మిగిలిన పరీక్షల ప్రక్రియ ఆరు రోజులు మాత్రమే ఉంటుందని, అయితే దీనికి కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.