నీతి ఆయోగ్ లేటెస్ట్ రిపోర్ట్: ఏపీ, తెలంగాణ స్థానాలివే: టాప్-10లో
అమరావతి: గత సంవత్సరానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ జాబితాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో సాధించిన పురోగతి ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. రాష్ట్రాలవారీగా ర్యాంకులను కేటాయించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వేర్వేరుగా ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ రెండు కేటగిరీల్లో- గుజరాత్, ఢిల్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించాయి.
రాష్ట్రాల కేటగిరీలో- ఏపీ, తెలంగాణ తొలి 10 స్థానాల్లో నిలిచాయి. ఈ విషయంలో ఏపీ తన ర్యాంకును మెరుగుపరచుకుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఏపీ ర్యాంకు 20. కాగా- ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 లోకి దూసుకెళ్లింది. పైపైకి ఎగబాకింది. తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 10వ స్థానాన్ని ఆక్రమించుకుంది. గుజరాత్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి.
గుజరాత్ తరువాత వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. గోవా, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, పుదుచ్చేరి తొలి అయిదు స్థానాలను దక్కించుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్ ఈ ఇండెక్స్ లిస్ట్లో చిట్టచివరి అయిదు స్థానాల్లో నిలిచాయి.
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులు పెట్టడానికి కల్పించిన అనువైన వాతావరణం, ఎగుమతుల లక్ష్యాలు.. వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ను రూపొందించింది. మౌలిక సదుపాయాలు, రవాణా కనెక్టివిటీ, ఆర్థిక విధానాల సరళీకరణ, పెట్టుబడిదారులు, ఎగుమతిదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ఆర్ అండ్ డీ.. వంటి అంశాలనూ పరిశీలించినట్లు పేర్కొంది.