బాలకృష్ణ ‘చేయి’ ఎఫెక్ట్: హిందూపురం నుంచి లోకేష్, హరికృష్ణకు చెక్!
Recommended Video

అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం బాలకృష్ణ అక్కడ్నుంచి పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.

హిందూపురం నుంచి లోకేష్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయడు తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కోసం హిందూపురం సీటును ఖాళీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను రాజ్యసభకు పంపాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ హిందూపురం కాకపోతే కృష్ణా, గుంటూరు, చిత్తూరుల నుంచి కూడా లోకేష్ పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ చేయి ఎఫెక్ట్
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. ఓ అభిమానిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనలు అభిమానులతోపాటు పార్టీ నేతలను కూడా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిస్థితుల దృష్ణ్యా బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం లేదని పలువురు అంటున్నారు.

బాలకృష్ణపై అసంతృప్తి జ్వాలలు
అయితే, బాలకృష్ణ మాత్రం తన అభిమానులపై చేయి చేసుకోవడంపై మరో రకంగా స్పందించారు. తాను అనుకోకుండా అక్కడి పరిస్థితిని బట్టి జరిగిందే కానీ, కావాలని చేయి చేసుకోలేదని చెప్పారు. బాలకృష్ణ.. అక్టోబర్ 3న తన అభిమాని, టీడీపీ కార్యకర్త అయిన బీ మారుతీపై చేయి చేసుకున్నాడు. ఇది హిందూపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అభిమానులపై చేయి చేసుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని పలువురు అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అభిమానుల దిగ్భ్రాంతి..
ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రజలతోపాటు వీరాభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుబడుతున్నారు. ప్రజా కార్యక్రమాల నుంచి బాలకృష్ణను దూరంగా ఉంచాలని కూడా వారు కోరుతుండటం గమనార్హం.

ఎన్టీఆర్-బాలకృష్ణ
హిందూపురం నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి కూడా అది టీడీపీకి కంచుకోటగానే ఉంటోంది. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) హిందూపురం నుంచి వరుసగా 1985, 1989, 1994, 1996లలో గెలుపొందారు. ఆ తర్వాత జీసీ వెంకట రాముడు, పామిశెట్టి రంగనాయకులు, పీ అబ్దుల్ ఘనీ కూడా ఇక్కడ్నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో బాలకృష్ణ 16వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

హరికృష్ణకు చెక్..
కాగా, రాజ్యసభకు బాలకృష్ణను పంపడం ద్వారా ఎన్టీఆర్ మరో కుమారుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణకు చెక్ పెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒక వేళ రాజ్యసభకు బాలకృష్ణను పంపితే.. హరికృష్ణకు ఆ అవకాశం ఉండదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మాజీ రాజ్యసభసభ్యుడైన హరికృష్ణ గత కొంత కాలంగా రాజకీయాలతోపాటు టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications