దేశ వ్యాప్తంగా లారీల సమ్మె: ఏపీలో మూతపడ్డ పెట్రోల్ బంకులు
అమరావతి: ఏపీలోని 13 జిల్లాల పరిధిలో పెట్రోల్ బంకుల యజమానులు నిరవధిక సమ్మె చేపట్టారు. డీజిల్పై లీటరకు రూ. 4 మేర విధిస్తున్న వ్యాట్ను తక్షణమే ఉపసంహరించాలన్న డిమాండ్తో సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు అయిల్ ట్యాంకర్ల సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరోవైపు టోల్ ప్లాజాలు, స్పీడ్ గవర్నర్ల ఎత్తివేతలే ప్రధాన డిమాండ్లుగా లారీ యజమానులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కూడా అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పిలుపుమేరకు లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మెలో పాల్గొంటుంది.
దేశవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని సంఘం ప్రధాన కార్యదర్శి జి దుర్గాప్రసాద్ ప్రకటించారు. సమ్మెతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.
తెలుగు రాష్ట్రాల పరిధిలోనే 14 లక్షల మేర లారీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో దేశ ఎగుమతులు, దిగుమతులపై పెను ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాక విశాఖ పోర్టులో సరుకు రవాణాపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. సమస్యలను సెప్టెంబర్ 28లోగా పరిష్కరించాలని కోరామని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చిందన్నారు.
దేశవ్యాప్తంగా రహదారులపై టోల్గేట్స్ ఎత్తివేయాలని, టిడిఎస్ను రద్దు చేయాలని యజమానులు డిమాండ్ చేస్తున్నాయి. సింగిల్ పర్మిట్, ఓవర్లోడ్, తెలంగాణ, ఎపి సరిహద్దుల్లోని సుమారు 30 చెక్పోస్టుల్లో అక్రమ వసూళ్లు నిలిపివేయాలని ఆలిండియా మోటార్స్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.