పుట్టపర్తి ఎంపీపీని చంపేందుకు పథక రచన: 11 మంది అరెస్ట్
హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు జిల్లాలో నలుగురిని హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసును అనంతపురం సీసీఎస్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తపంచా, 4 వేటకొడవళ్లు, రెండు ఇనుపపైపులు, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి, అనంతపురం జిల్లా ఎస్పీ మాల్యాద్రి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం నలుగురిని హత్య చేసేందుకు వ్యూహా రచన చేశారని తెలిపారు.
పుట్టపర్తి ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీరాములతోపాటు చంద్ర అనే వ్యక్తిని వీరు హత్య చేసేందుకు పూనుకున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లెలోని ఓ కళాశాల యజమానిని కూడా హత్య చేసేందుకు కుట్రపన్నారని మాల్యాద్రి చెప్పారు.
అరెస్టైన 11 మందిలో కదిరి పట్టణానికి చెందిన రౌడిషీటర్ నారాయణ నాయక్ కూడా ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.