విశాఖలో AAA Cinemas గ్రాండ్ ఇనాగ్యురేషన్: రాకా పై అద్దిరిపోయే అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
సాగరనగరం విశాఖపట్నంలో ప్రాజెక్ట్ తెర మీదికి వచ్చింది. ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్ (AAA Cinemas) మల్టీప్లెక్స్ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. ఇప్పటివరకు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఈ మల్టీప్లెక్స్.. నేటి నుంచి విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని ప్రారంభించారు. ఏఏఏ సినిమాస్ బ్రాండింగ్.. ఏపీలో విస్తరించడం ఇదే మొదటిసారి.
విశాఖపట్నం కైలాసపురంలో రూపుదిద్దుకుంటోన్న ఇనార్బిట్ మాల్ లో ఏఏఏ సినిమాస్ నిర్మితమైంది. గత ఏడాది నవంబర్ లో దీనికి పునాదిరాయి పడింది. శంకుస్థాపన చేసిన తొమ్మిది నెలల వ్యవధిలో ఈ కాంప్లెక్స్ ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది స్క్రీన్లు ఇందులో ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఎల్ఈడీ ప్రొజెక్షన్ క్యూలుక్సన్ స్క్రీన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు.

ఏపీలోనే అతిపెద్దదైన 70 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగిన భారీ ఎల్ఈడీ సినిమా స్క్రీన్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 1,556 మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమాను తిలకించే సీటింగ్ సామర్థ్యంతో ఈ థియేటర్ లో ఉంది. ఇందులో ప్రత్యేకంగా ఐకాన్ స్టార్ లాంజ్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ లాంజ్ ద్వారా రీక్లైనర్ టికెట్ తీసుకునే వీఐపీల కోసం స్పెషల్ ఎంట్రీ సదుపాయం ఉంటుంది.
దీంతో పాటు.. ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్స్, సినిమా ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లను నిర్వహించుకోవడానికి ప్రత్యేకంగా 82 లాంజ్ ను నిర్మించారు. ఇందులో డాల్బీ సౌండ్ సిస్టమ్ తో కూడిన స్పెషల్ స్క్రీన్ ఇందులో ఉంది. విశాఖపట్నం తర్వాత ఏఏఏ మల్టీప్లెక్స్ సినిమాస్ క్రమంగా మిగిలిన నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఈ మల్టీప్లెక్స్ లు నిర్మితం కావొచ్చు.
ఇదివరకు ఆసియన్ థియేటర్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కొలాబరేట్ అయిన విషయం తెలిసిందే. ఏఎంబీ పేరుతో మహేష్ బాబు మల్టీ చెయిన్ థియేటర్లను నిర్మిస్తోన్నారు. ఇప్పుడు తాజాగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. ఆసియన్ థియేటర్స్ యాజమాన్యంతో చేతులు కలిపారు.
ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. రాకా మూవీపై అప్ డేట్స్ ఇచ్చారు క్లుప్తంగా. ప్రస్తుతం ఈ మూవీ ముంబైలో జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం తాను ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచే వచ్చానని, ఈ కాంప్లెక్స్ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక్కరోజు బ్రేక్ తీసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. మళ్లీ రేపట్నుంచి రాకా షూటింగ్ లో పాల్గొంటానని అల్లు అర్జున్ వివరించారు.
విశాఖకు ఇనార్బిట్ వంటి ఓ మాల్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చానని, అప్పట్లో ఇక్కడి రోడ్లు ఖాళీగా ఉండేవని, ఇప్పుడు అడుగు పెట్టడానికి కూడా చోటు ఉండట్లేదని నవ్వుతూ చెప్పారు. మాల్ అనేది ఓ కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే కాదని, నగరాల కల్చర్ కు అది అద్దంపడుతుందని పేర్కొన్నారు. వైజాగ్ లో ఈ మాల్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని అన్నారు.
2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మించింది. 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుందీ ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. మొత్తం 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది రహేజా గ్రూప్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్, వసై, నవీ ముంబై, వడోదర.. వంటి నగరాల్లో ఇవి నిర్మితం అయ్యాయి. విశాఖపట్నం కూడా ఆయా నగరాల జాబితాలో చేరనుంది.





Click it and Unblock the Notifications