భానుడి భగభగల మధ్య 3 రోజులు ఏపీకి చల్లటివార్త
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలతోపాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లోను మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాకాలంలోను రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, కావలి, నెల్లూరు, ఒంగోలు, గన్నవరం, నందిగామ, మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ, తుని, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రోజు అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా కాకినాడ జిల్లా శంఖవరంలో 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్షం కురిసి వెలిసిన తర్వాత ఉండే వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వేసవికాలాన్ని మించేలా భానుడు భగభగలాడుతుండటంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఉపరితల ఆవర్తనం ఉత్తర కర్ణాటకకు ఆనుకొని తెలంగాణ ప్రాంతంలో విస్తరించివుంది. మూడురోజులపాటు కురిసే వర్షాలకు మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విప్తతుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. రైతులు, రైతు కూలీలు విద్యుత్తు స్తంభాలకు సమీపంలో, చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు నాలుగు సన్నాహక బృందాలను సిద్ధంగా ఉంచారు.












Click it and Unblock the Notifications