ఆ పథకం..పట్టణ ప్రాంతాలకే: గ్రామాల్లో ఎప్పుడంటే?: పేదల ముంగిట్లోకి బియ్యం బండి
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఇంటింటికీ బియ్యం పథకం ప్రారంభమైంది. పేద ప్రజల ముంగిట్లోకి వచ్చేసింది. ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేశారు. ఇది గ్రామాలకు చేరడానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిసేపటి కిందటే ఇంటింటికీ బియ్యం పంపిణీని స్థానిక అధికారులు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున.. ఎలాంటి అధికార కార్యక్రమాలు లేకుండా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
నిమ్మగడ్డ ఆదేశాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఈ ఐఎఎస్పై చర్యలకు: ఎస్ఈసీకి రిప్లయ్
కదిరిలో ప్రారంభించాలనుకున్నా.
నిజానికి- ఇంటింటికీ బియ్యం పథకాన్ని అనంతపురం జిల్లా కదిరిలో లాంఛనప్రాయంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం, ఈ పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడం వంటి పరిణామాల మధ్య వాయిదా పడుతుందని భావించారు. దీనిపై ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం నడిచింది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
పట్టణ ప్రాంతాలకు మాత్రమే..
పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున గ్రామాల్లో ఈ పథకాన్ని వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. పట్టణాలకు పంచాయతీ ఎన్నికల కోడ్ వర్తించనందున.. అక్కడ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిసేపటి కిందటే ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి కిందటి నెల 21వ తేదీన ప్రారంభించిన బియ్యం బండ్ల ద్వారా రేషన్ను అందజేస్తోన్నారు. తెల్లరేషన్ కార్డుదారుల కుటుంబాలకు ఇంటి వద్దే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మండలస్థాయి పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత..
ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలివిడత పోలింగ్ కోసం నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత.. ప్రవర్తనా నియమావళిని ఎత్తేసిన తరువాత గ్రామాల్లో బియ్యం పంపిణీ ఆరంభమౌతుంది. దీనికి కనీసం నెలరోజుల సమయం పట్టొచ్చు. మార్చి 1వ తేదీ నుంచి గ్రామాల్లో ఇంటింటికీ బియ్యం పంపిణీని చేపడతారని అంటున్నారు.