ఆ కిక్ దేనిలోనూ రాదు...దేశంలో సక్సెస్ ఫుల్ టీమ్ మనదే:చంద్రబాబు
అమరావతి:దేశంలోనే సక్సెస్ ఫుల్ సివిల్ సర్వీసెస్ టీమ్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉదని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబునిచ్చారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపిలోని అఖిల భారత సర్వీసుల అధికారుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో గ్రామ స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరూ కలిసి పనిచేయడంవల్లే ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత ఫలితాలు సాధించగలిగామని, ఇందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని సిఎం చెప్పారు. విజయం ఇచ్చే కిక్ దేనిలోనూ రాదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అప్పుడు అందరూ...తెలంగాణా వైపే
రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీసుల అధికారుల్లో ఎక్కువ మంది తెలంగాణకే వెళ్లేందుకు మొగ్గు చూపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కానీ ఆ తరువాత ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత చూస్తే దేశంలోనే విజయవంతమైన అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. ఏ ప్రమాణాలపరంగా చూసినా దేశంలో మనమే ముందంజలో ఉన్నాం. ఐఐటీల్లో 12 శాతం సీట్లు మన రాష్ట్రానికే వచ్చాయి. ఈ విషయంలో గుజరాత్ దిగువన ఎక్కడో ఉంది. మనం కొద్దిగా మనసు పెడితేనే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయం ఇచ్చే కిక్...రుచి మరిగితే
రాష్ట్రంలో గ్రామ స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకూ కలిసి పనిచేయడంవల్లే ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతాలు సాధించగలిగామని, ఇందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని సిఎం చంద్రబాబు చెప్పారు. విజయం ఇచ్చే కిక్ దేనిలోనూ రాదని అన్నారు. తాను టీమ్ లీడర్ ను, సమన్వయకర్తను మాత్రమేనని, ఘనత మొత్తం అధికారులు, సిబ్బందికే చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. "బృంద నాయకులంతా అంకిత భావంతో పని చేయాలి. బృందాన్ని నడిపించడంలో ఓపిక ఉండాలి. ఏ బృందంలోనైనా ఒకరిద్దరు సరిగ్గా పని చేయని వాళ్లుంటారు. వాళ్లనూ విశ్వాసంలోకి తీసుకుని స్ఫూర్తి నింపాలి. ఒక్కసారి విజయం రుచి మరిగి పేరు వస్తే వాళ్లూ అద్భుతంగా పనిచేస్తారు"... అని చంద్రబాబు పేర్కొన్నారు.
కమ్యూనికేషన్ గ్యాప్...వద్దు
అయితే ఒక వ్యవస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని సిఎం చంద్రబాబు హితవు పలికారు. అలా వుంటే దాని వల్ల చాలా సమస్యలొస్తాయంటూ అందుకు ఉదాహరణగా నార్మన్ ఫోస్టర్ రాక సందర్భంగా చోటుచేసుకున్న ఘటన గురించి చెప్పారు. "ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్, అమరావతికి డిజైన్లు రూపొందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సోమవారం ఒడిశా వెళుతూ నన్ను కలిసేందుకు ఉండవల్లి వచ్చారు. స్వయంగా ఆయనే వచ్చిన విషయం నాకు తెలియదు. మనవాళ్లు నాకు సరిగా సమాచారం ఇవ్వలేదు. నేను వేరే సమావేశాల్లో ఉన్నా. ఆ తరువాత ర్యాలీ కోసం విజయవాడకు వెళ్లడంతో నన్ను కలిసేందుకు ఆయన మున్సిపల్ స్టేడియానికి వచ్చారు. అప్పటికే సభ మొదలైంది. ఇక కుదరదనుకుని ఆయన విమానాశ్రయానికి బయల్దేరారు.
విమానం...ఎక్కించి వచ్చా
ఆ తరువాత ఇలా నార్మన్ ఫోస్టర్ నా కోసం వెయిట్ చేసిన విషయం తెలియడంతో..."నేను సభ ముగిశాక అప్పటికప్పుడు నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ఫోస్టర్ను కలిసి, దగ్గరుండి విమానం ఎక్కించి వచ్చా. ఆయనతో నాకేం పని అనుకుంటే ఇబ్బంది. ఆయనకు మనపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ భావన ఎప్పటికీ ఉండిపోతుంది. నేను వెళ్లడంవల్ల ఆయన సంతోషించారు. మళ్లీ అమరావతి వస్తానని చెప్పారు. అలాంటివాళ్లు పది మందికి చెబితేనే అమరావతి అంటే తెలుస్తుంది. అమరావతి అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన కితాబిచ్చారు" అని ముఖ్యమంత్రి కలెక్టర్లకు వివరించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మనం సాధిస్తున్న పురోగతి చూస్తుంటే అంతకు ముందే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని ముఖ్యమంత్రి విశ్లేషించారు.