దొడ్డిగుంట.. కాదు కాదు.. కవలల గ్రామం ఎక్కడుందో తెలుసా?!
ఇది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం కథ. ఇక్కడ ఏ వీధిలో చూసినా ఒకే పోలికతో ఉండే కవలలు మీకు తారసపడతారు. సుమారు ఐదువేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 500ల మంది వరకూ కవల జంటలు ఉన్నట్లు అంచనా. దీంతో కవలల గ్రామంగా దొడ్డిగుంట గ్రామం పేరుపొందింది. దీనికి ప్రధాన కారణం ఆ ఊరిలో మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉన్న బావి నీరు అని చెబుతున్నారు. ఈ విషయం కాస్తా వైరల్ కావడంతో కవల పిల్లలు కావాలనుకునే జంటలు ఆ ఊరి బావి నీటి కోసం ఇప్పుడు క్యూ కడుతున్నారు. అంతేకాదు, ఆ బావి నీటిలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ నీరు సర్వరోగ నివారిణి అని గ్రామస్తుల నమ్మకం.
అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలకూ : నిజానికి ఈ గ్రామంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే దీనిని పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామంగా చెప్పొచ్చు. ప్రస్తుతం కవలల గ్రామంగా దీని పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం ఈ గ్రామం నుంచి పలువురు ఉన్నత చదువులను అభ్యసించి.. దూర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. అయితే, అలాంటివారితోపాటు ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళుతోన్న వారకి సైతం కవల పిల్లలే పుడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ మాత్రం కవలలు ఎక్కువగా పుట్టడానికి ఊరి చివరిలో ఉన్న బావి నీరే కారణమని గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే, ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ కవలలు కనిపించడం సర్వసాధారణం అయిపోయిందంటున్నారు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలా బయటపడిందట : మొదట్లో.. తమ ఊరిలో ఈ ప్రత్యేకత ఉన్నట్లు గ్రామస్తులకు కూడా తెలియదట. సుమారు 30 ఏళ్ల క్రితం దొడ్డిగుంట ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వచ్చిన ఓ మాస్టారు ద్వారానే ఈ గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారని ప్రపంచానికి తెలిసిందని చెబుతున్నారు. ఆ మాస్టారు జనాభా లెక్కల కోసం ఇంటింటికీ తిరుగుతుంటే చాలామంది కవలలు ఆయనకు కనిపించారు. దాంతో ఆయన ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత అదే ఊరికి కాపురం వచ్చారట. ఆయనకు కూడా తనకు చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదని బాధపడేవారడని, కానీ, దొడ్డిగుంట రావడం, ఆ బావి నీరు తాగడంతో ఆయన భార్య కూడా కవలలకు జన్మనిచ్చిందని చెబుతున్నారు. ఆ ఘటనతో దొడ్డిగుంట బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారు, కవలలు పుడతారని అన్ని ప్రాంతాలకూ పాకిందని అంటున్నారు.
ఇది అశాస్త్రీయం : అయితే ఆ బావి నీళ్ల వల్ల పిల్లలు కలుగుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పలువురు వైద్యులు కొట్టిపారేస్తున్నారు. అలాగే, కవలలు జన్మించడానికి జన్యుపరమైన పలు కారణాలుంటాయంటున్నారు. అంతేకాదు, వంశపారంపర్యత కూడా కవలలకు ఓ కారణంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భదారణ సమయంలో ఒకటి కన్నా ఎక్కువగా అండం విడుదల కావడం, ఫలదీకరణ చెందడం ప్రధాన కారణం. జెనిటిక్స్, వయసు, మునుపటి గర్భాలు, పునరుత్పత్తి వంటివి ప్రభావం చూపుతాయి.

శాస్త్రీయంగా పిల్లలు కలగకపోవడానికి కూడా అనేక కారణాలున్నాయి. అంతేకాని, బావి నీరు తాగడం వల్ల పిల్లలు పుడతారు అనేది పూర్తిగా అశాస్త్రీయమని చెబుతున్నారు. నిజానికి ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మిళితం నీరు. అందులో మరికొన్ని సూక్ష్మ లవణాలుంటాయి. కాల్షియం కార్భోనేట్, ఐరన్, కాల్షియం వంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం లేదు. కానీ, నీటిలోని లవణాల కారణంగా కొన్ని సమస్యలు తీరతాయని చెబుతున్నారు. అయితే, కారణం ఏదైనా.. ఇక్కడి ప్రజల విస్వాసం కారణంగా ఎక్కడో మారుమూల ఉన్న దొడ్డిగుంట గ్రామం పేరు.. కవలల గ్రామంగా మారుమ్రోగుతోంది.












Click it and Unblock the Notifications