ఏపీ సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు-మంత్రుల కమిటీపై రియాక్షన్ ఇదే..!
ఏపీలో సచివాలయ ఉద్యోగులకు నిన్న కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తొలిసారి ప్రమోషన్లు ఇచ్చేందుకు వీలుగా 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. తమ నియామకాలు జరిగి ఆరేళ్లు దాటి పోయినా ప్రమోషన్లు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఊరటనిచ్చింది. దీనిపై సచివాలయాల ఉద్యోగుల జేఏసీ స్పందించింది.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్వాగతించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు మరియు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులతో విలీనం చేయాలని ఐక్యవేదిక తరపున చేసిన కృషి ఫలించిందని నేతలు తెలిపారు.

మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేస్తూ నిర్ధిష్ట గడువులోగా పదోన్నతులు కల్పించి అన్నీ ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులతో కూడిన విలీనం జరిగేలా మరియు ఇతర సమస్యల పరిష్కారం చేయాలని ఉద్యోగుల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు పెట్టిన పలు డిమాండ్లలో కీలక డిమాండ్ నెరవేరినట్లయింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన సచివాలయ ఉద్యోగుల వ్యవస్దపై కూటమి సర్కార్ శీతకన్ను వేసిందన్న విమర్శలు ఇప్పటివరకూ వినిపించాయి. ముఖ్యంగా వాలంటీర్లను తొలగించి వారి పనులు కూడా తమతోనే చేయిస్తున్నారన్న ఆవేదన ఉద్యోగుల్లో పెరుగుతోంది. దీంతో పాటు ఇతర ఆర్ధిక డిమాండ్లను కూడా వారు ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరసనలకు కూడా దిగుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రమోషన్లపై మంత్రుల కమిటీ ఏర్పాటు వారికి ఊరటనిచ్చినట్లు చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications