కేసీఆర్ కోసం అమరావతి జ్ఞాపిక: అనుమతించని పోలీసులు, హైదరాబాద్కు రావాలంటూ సూచన
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అమరావతి జ్ఞాపికను అందించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. వివరాల్లోకి వెళితే, ఈనెల 23 నుంచి 27 వరకు తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించడానికి కేసీఆర్ సోమవారం విజయవాడకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్కు అమరావతి జ్ఞాపికను అందించేందుకు విజయవాడకు చెందిన మహ్మద్ మోషిన్ సోమవారం విఫలయత్నం చేశారు. సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన కేసీఆర్ను కలిసి జ్ఞాపికను అందించేందుకు మోషిన్ తన అనుచరులతో అక్కడికి వచ్చారు.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అతన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక అతడు అక్కడి నుంచి వెనుదిరిగాడు. అనంతరం తాను సీఎం కేసీఆర్ కోసం తెచ్చిన జ్ఞాపిక విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మహ్మద్ మోషిన్ మాట్లాడుతూ గతంలో వరంగల్ కోట ద్వారాన్ని గుర్తించి దానికి తెలుగు తోరణంగా ఎన్టీరామారావు నామకరణం చేశారని చెప్పారు.

పురావస్తు ఆసక్తి ఉన్న వాడిగా తాను క్రీపూ 600వ సంవత్సరం నాటి అమరావతి తోరణాన్ని గుర్తించి దాన్ని జ్ఞాపికగా తయారు చేయించినట్టు తెలిపారు. అమరావతి తోరణంలో అశోకచక్రం కూడా ఉన్నట్టు తాను గుర్తించానన్నారు. వీటికి సంబంధించిన అవశేషాలు ప్రస్తుతం మన ప్రాంతంలో లేవని, మద్రాసు మ్యూజియంలో కొన్ని ఉన్నాయని చెప్పారు.
అమరావతి తోరణానికి సంబంధించిన పురాతన కట్టడం, చరిత్రను గుర్తుచేసేలా ఈ జ్ఞాపికలను ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులకు అందజేశానన్నారు. ఇప్పు డు అమరావతి తోరణం చిత్రానికి ఓవైపు తెలుగు తల్లి, మరోవైపు తెలంగాణ తల్లి ఫొటోలు చిత్రీకరించి కేసీఆర్కు బహూకరించేందుకు తీసుకొచ్చానని తెలిపారు.
అయితే కేసీఆర్ కోసం జ్ఞాపికను తీసుకొచ్చిన మహ్మద్ మోషిన్ను పోలీసులు లోపలికి అనుమతించని విషయాన్ని గమనించిన ఎంపీ బాల్క సుమన్ ఓ ఛానల్ ప్రతినిధి ద్వారా అతనితో ఫోన్లో మాట్లాడారు. జ్ఞాపికతో హైదరాబాద్కు రావాలని సూచించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications