జగన్కు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ షాక్- గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి ఫిర్యాదు- త్వరలో సుప్రీంకోర్టుకు
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరులో వైఎస్సార్ పదం వాడకుండా నిరోధించాలని కోరుతూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమ పార్టీలోని వైఎస్సార్ పేరును వాడుకుంటూ తమపైనే దాడులకు పాల్పడుతున్న వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని కోరింది. ఈసీ నుంచి సరైన స్పందన రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ మాదే....
యువజన శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీగా గతంలో ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేయించిన తెలంగాణ నేత శివకుమార్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు ఏ స్ధాయిలో చుక్కలు చూపించారో చూశాం. తాజాగా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో నమోదైన ఓ పార్టీ తమ పేరును వైసీపీ వాడుకుంటోందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో మరోసారి వైసీపీ పేరు గుర్తింపు వివాదంలో చిక్కుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఈ విధంగా ఈసీని ఆశ్రయించడం కలకలం రేపుతోంది.

వైసీపీని రద్దు చేయాలంటూ...
సీఎం జగన్ నేతృత్వంలోని యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా చెప్పుకోవడం నిబంధనలకు విరుద్ధమని, తమ పార్టీ పేరులోని వైఎస్సార్ ను వాడుకోవడం తగదని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. నిబంధనలను అతిక్రమించి తమ పార్టీ పేరును వాడుకుంటున్న జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మహబూబ్ బాషా, అబ్దుల్ సత్తార్ ఈసీని ఇవాళ కోరారు. ఒక పేరుతో రిజిస్టర్ అయ్యాక మరో పేరును వాడుకుంటూ ఎలా చలామణీ అవుతారని వీరు ఫిర్యాదులో ప్రశ్నించారు. కాబట్టి ఈసీ నిబంధనల ప్రకారం జగన్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈసీ వద్దన్నా వాడేస్తున్నారంటూ..
జగన్ పార్టీ వ్యవహారంపై గతంలోనే ఈసీకి ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత వైఎస్సార్ పేరు వాడకుండా ఈసీ ఆదేశాలు కూడా ఇచ్చిందని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహబూబ్, సత్తార్ గుర్తుచేశారు. అయినా అధికార బలంతో తమ పార్టీ పేరు ఉపయోగించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన మ్యానిఫెస్టోతో పాటు నవరత్నాలు కార్యక్రమంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పేరు వాడుకుంటున్నారని, తాజాగా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పంపిన షోకాజ్ నోటీసులోనూ ఇదే పేరు వాడారని వారు ఆధారాలతో సహా ఈసీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చి...
ముస్లిం సోదరుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి రిజిస్టర్ చేసిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పేరును దౌర్జన్యంగా, అక్రమంగా వాడుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో రిజిస్టర్ అయిన పార్టీ తమది మాత్రమేనన్నారు. రాష్ట్రంలో జగన్ పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలన్నారు.
ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని మహబూబ్ భాష, అబ్దుల్ సత్తార్ జీ తెలిపారు.












Click it and Unblock the Notifications