ఏపి టీడిపిలోకి మరో కాంగ్రెస్ నేత..! బెర్తు ఖరారు చేసిన అదిష్టానం..!?
అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో అదికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి, ప్రతిపక్ష పార్టీ నుండి అదికార పార్లీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా మేం ఎవరికి తీసిపోమన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పార్టీ మారేందుకు సుముఖత చూపిస్తున్నారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారే వారితో పార్టీల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో.. ఎవరు వచ్చి తమ టికెట్కు ఎసరు పెడతారనోన్న ఆందోళన సిట్టింగుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్రెడ్డి టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు. తాజాగా అనంతపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
శైలజానాథ్ త్వరలో చంద్రబాబుతో భేటీ అయ్యి టీడీపీలో చేరతారని చర్చ జరుగుతోంది. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా, విప్గా పనిచేసిన అనుభవం ఉంది. శైలజానాథ్ టీడీపీలోకి వస్తే అనంతపురం జిల్లాలోని శింగనమల టికెట్ ఇచ్చందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయంలో ఇరువర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం శింగనమల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున యామినిబాల సిట్టింగ్ ఎం.ఎల్.ఏగా ఉన్నారు. ఆమెకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆమె తల్లి శమంతకమణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం కల్పించారు. యామినిబాలకు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు శమంతకమణికి ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇచ్చారని టీడిపి శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.