విజయవాడలో మరో హత్య...వరుస హత్యలతో బెడవాడ లో కలకలం...
విజయవాడ: విజయవాడలో మరో దారుణ హత్య జరిగింది...కొద్దిరోజుల క్రితం ఇదే నగరంలో జరిగిన రౌడీ షీటర్ హత్యా ఘటన మరువక ముందే ఇక్కడే మరో దారుణం జరిగింది.
విజయవాడ సింగ్నగర్ ముత్యాలమ్మ కాలనీలో నూడిల్స్ వ్యాపారి చందా వెంకటేశ్వరాజును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి దారుణంగా హతమార్చారు. అతని మృతదేహం రోడ్డుపై పడి ఉన్న తీరును బట్టి నిందితులు ముందు అతన్ని చంపి ఆ తరువాత రోడ్డు మీదకు తెచ్చి పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు...వివరాలిలా ఉన్నాయి.
నూడిల్స్ వ్యాపారం చేసే చందా వెంకటేశ్వరరాజు అర్ధరాత్రైనా ఆయన షాపు నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఫోన్ పనిచేస్తుండక పోవడంతో భయాందోళనలకు గురై అతని కోసం నగరమంతా మారుమూల ప్రాంతాలతో సహా అంతా వెతికారు. అయినా ఆచూకి లభించక తల్లడిల్లిపోయారు. అయితే ఉదయం కల్లా నడిరోడ్డుపై విగతజీవిగా పడివున్న వ్యాపారిని చూసిన కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటసనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నూడిల్స్ వ్యాపారి చందా వెంకటేశ్వర రాజు హత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యాపారికి ఎవరైనా శత్రువులున్నారా? చందా అంటే పడనివాళ్లెవరు? ఎందుకోసం హత్య చేశారు? ఈ దారుణానికి పాల్పడింది జిల్లావాసులేనా? కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించిన తరువాతే వ్యాపారి హత్య వెనుక ఎవరున్నారో తెలిసే అవకాశ ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు విజయవాడలో వరుస హత్యలు స్థానికులను కలవరపెడుతున్నాయి. విజయవాడలో మళ్లీ హత్యా సంస్కృతి మొదలైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అయితే నూడిల్స్ వ్యాపారి వెంకటేశ్వర రాజును బ్లేడ్ బ్యాచ్ హత్యచేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. వ్యాపారం పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా బ్లేడ్ బ్యాచ్ కు ఎదురైన వెంకటేశ్వరరాజును వారు డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో ఇవ్వలేదని, దీంతో ఆగ్రహంతో అతడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తెలిసింది.
ఇదే విధంగా దుర్గ అనే వ్యక్తిని బ్లేడ్ బ్యాచ్ గాయపర్చడం ద్వారా వెంకటేశ్వర రాజు హత్యను కూడా వారే చేసిన విషయం బైటపడింది. బ్లేడ్ బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుర్గ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.