నైట్ పార్టీలకు వెళ్లలేదు, విద్యార్ధులడిగితేనే డ్యాన్స్ చేశా: ప్రిన్సిపాల్ బాబూరావు
హైదరాబాద్: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్పై రిషికేశ్వరి తల్లిదండ్రులు తనకు ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్ బాబురావు చెప్పారు. క్యాంపస్లో జరిగిన ర్యాగింగ్ తన దృష్టికి రాలేదని బాబూరావు పేర్కొన్నారు. తానెప్పుడూ విద్యార్ధులతో తప్పుగా వ్వవహరించలేదని తెలిపారు.
నైట్ పార్టీల్లో తానెప్పుడూ పాల్గొనలేదని చెప్పిన ఆయన, విద్యార్థుల బలవంతం మేరకు ఫ్రెషర్స్ డే వేడుకలకు మాత్రమే హాజరయ్యానని జిల్లా లీగల్సెల్ అథారిటీ ముందు చెప్పారు. దీంతో రిషికేశ్వరి కేసు విచారణను ఈ నెల 7వతేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా లీగల్సెల్ అథారిటీ ప్రకటించింది.

రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతున్న బాలసుబ్రహ్మణ్యం కమిటీ ముందు ప్రిన్సిపాల్ బాబూరావు శనివారం ఉదయం హాజరయ్యారు. ఆయనతో పాటు హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి కూడా విచారణకు హాజరయ్యారు. విద్యార్థిని ఆత్మహత్య, ర్యాగింగ్ అంశాలపై నాగార్జున యూనివర్సిటీలో వారిద్దరినీ ప్రశ్నించారు.
రిషికేశ్వరి ఆత్మహత్యపై సీనియర్ల వేధింపులకు సంబంధించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై బాబూరావు స్పందించలేదన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు విద్యార్థులతో నైట్ పార్టీల్లో ఆయన డ్యాన్స్ చేసిన వీడియోలు కలకలం కూడా సృష్టించాయి. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబూరావు ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications