ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయ్యేనా??
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలైతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో ఉప రాష్ట్రపతులుగా పనిచేసిన వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, జాకీర్ హుస్సేన్, డాక్టర్ శంకర్దయాళ్శర్మ, కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు. ఆ కోవలోనే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అవుతారా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఉపరాష్ట్రపతులుగా ఉన్నవారంతా ఎంపికయ్యారు
శంకర్ దయాళ్ శర్మకు ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆర్ వెంకట్రామన్ ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆ తర్వాత జాకీర్ హుస్సేన్, ఆ తర్వాత వి.వి. గిరి, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్ వరుసగా రాష్ట్రపతులుగా ఎంపికైనవారే. అదే సెంటిమెంట్ ప్రకారం వెంకయ్యనాయుడు కూడా రాష్ట్రపతి అవుతారనే నమ్మకం ఎక్కువగా దక్షిణాది ప్రజల్లో కనపడుతోంది.
శంకర్దయాళ్ శర్మను వ్యతిరేకించిన ఎన్టీఆర్
ఉపరాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మను రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రకటించారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్గా ఉన్న ఎన్టిఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ వ్యతిరేకతపై శంకర్దయాళ్శర్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎందుకంటే ఆయనకు మొదటి నుంచి కాషాయవస్త్రాలు ధరించిన ఎన్టీఆర్ అంటే ఇష్టపడేవారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ దయాళ్ శర్మకు 6,75,504 ఓట్లు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి జి.జి. స్వెల్కు 3,46,485 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కె.ఆర్.నారాయణన్కు అన్ని పార్టీల మద్దతు
ఆ తర్వాత ఉప రాష్ట్రపతిగా ఉన్నత విద్యావంతుడు కె.ఆర్.నారాయణ్ను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్టీరామారావు కూడా ఆయనకు మద్దతు పలకడంతో చాలా సులువుగా ఆయన ఉప రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
మరో ముగ్గురు నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో రెండు రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేస్తున్నవారి పేర్లు వినపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ దక్షిణాది నుంచి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ పెద్దలు అడుగు ముందుకు వేస్తారా? లేదంటే తమ రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచించి ఇతర నిర్ణయమేదైనా తీసుకుంటారా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!