ఒకే మాటపై జగన్-కేసీఆర్-చంద్రబాబు..!!
అమరావతి/హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవ్వాళ తన 72వ పుట్టినరోజును జరుపుకొంటోన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్కు వెళ్లిన ఆయన భారత్కు తిరిగి వచ్చారు. రెండు రోజుల ఆ సదస్సు సందర్భంగా రష్యా, టర్కీ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, రెసెప్ తయ్యిప్ ఎర్డగాన్ సహా వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులతో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
మధ్యప్రదేశ్లో..
ఆ సదస్సును ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఇవ్వాళ తన జన్మదినాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను ఆయన అభయారణ్యంలో విడిచిపెట్టనున్నారు. షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్కు చేరుకోనున్నారు మోదీ. అలాగే కరాహల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.
మోదీకి విషెస్..
కాగా- మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు..ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తమ అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై పోస్టులు పెట్టారు. నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పాటు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోన్నాననంటూ కేసీఆర్ ఓ ప్రకటనను ట్విట్టర్లో విడుదల చేశారు. మరిన్నో సంవత్సరాలు పరిపాలన సాగించాలని చెప్పారు.
మోదీతో అనుబంధం..
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మోదీకి షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఓ ఫొటోను ఆయన ట్వీట్కు జతచేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చంద్రబాబు చెప్పారు. ప్రజల సంక్షేమానికి, దేశ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేయాలని అకాంక్షించారు. మోదీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చీపురు పట్టిన కేంద్ర మంత్రి..
ప్రధాని జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సేవా పఖ్వాడా వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఆరోగ్య, రక్తదాన, టీకా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో బూస్టర్ డోసులు అందిస్తారు. టీకాలను వేస్తారు. హెల్త్ చెకప్ చేస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సేవా పఖ్వాడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టారు. చీపురు పట్టారు. ఢిల్లీలో అత్యంత రద్దీతో కూడుకుని ఉన్న హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ పరిసరాలను ఆయన చీపురుతో ఊడ్చారు.












Click it and Unblock the Notifications