చంద్రబాబు సర్కార్లో తొలి బడ్జెట్- తినబోతూ రుచులెందుకు?
Chandrababu: ఏపీ అసెంబ్లీ ఇంకాస్సేపట్లో సమావేశం కాబోతోంది. ఇవి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. మరో నాలుగు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి బడ్జెట్ ఇదే. ఇదివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగించిందీ సర్కార్.

బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి ఈ ఉదయం 9 గంటలకు మంత్రవర్గం సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులందరూ ఇందులో పాల్గొననున్నారు. ఈ ప్రతిపాదనలను యధాతథంగా ఆమోదించే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం 2.9 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక విద్య, వ్యవసాయం, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం సహా భారీ నీటి ప్రాజెక్టులు, రోడ్లు- ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం వారందరూ అసెంబ్లీకి బయలుదేరి వెళ్తారు. ఉదయం 10 గంటలకు సభ సమావేశమౌతుంది. 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. శాసన మండలిలో ఈ బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు.
కొద్దిసేపటి కిందటే ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పయ్యావుల కేశవ్ నివాసానికి చేరుకున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన బ్రీఫ్కేస్ను ఆయనకు అందించారు. దీనికి సంబంధించిన కొన్ని గ్లాన్స్ను మంత్రికి ఇచ్చారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు జానకి, నివాస్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications