తమిళనాడులో రైతుల వింత నిరసన
తమిళనాడులో రైతులు మరోసారి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. కావేరీ జలాల సాధన, పంటలను కాపాడుకోవడం కోసం తిరుచిరాపల్లిలో కావేరీ నదీ తీరంలో రైతులు తమ శరీరాలను ఇసుకతో కప్పుకొని ఆందోళనకు దిగారు. రైతు సంఘం నేత పీ అయ్యకణ్ణు నేతృత్వంలో జరిగిన ఈ నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటను కాపాడుకోవడానికి కర్ణాటక వెంటనే నీటిని విడుదల చేయాలనేది వారి ప్రధాన డిమాండ్.
కావేరీ జలాల వాటా విషయంలో కర్ణాటక అనుసరిస్తున్న వైఖరిపై తమిళనాడు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. కావేరీ నదిపై ఆధారపడే పంటలు ఎండిపోతున్నా కర్ణాటక ప్రభుత్వం స్పందించట్లేదని ఆరోపించారు. తమకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను విడుదల చేయకుండా, వరదలు వచ్చినప్పుడు మాత్రమే మిగులు జలాలను వదులుతూ తమ రాష్ట్రాన్ని డ్రైనేజీలా చూస్తోన్నారని ఆరోపించారు.

కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రైతులు. మేకేదాటు వద్ద కర్ణాటక కొత్తగా జలాశయాన్ని నిర్మిస్తే లోతట్టు ప్రాంతమైన తమిళనాడుకు నీటి కొరత మరింత తీవ్రతరమౌతుందని, ఎడారిగా మారుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కావేరీ డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు నిర్జీవంగా మారే ప్రమాదం ఉందంటూ రైతులు హెచ్చరించారు.
తమిళనాడు కావేరీ డెల్టా జిల్లాల్లో వ్యవసాయానికి కావేరీ నదీ జలాలే ప్రధాన ఆధారం. సకాలంలో సాగునీరు అందకపోతే ఈ ఏడాది ఖరీఫ్ పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కావేరీ జలాల నిర్వహణ బోర్డు నిర్దేశించిన నియమాల ప్రకారం కర్ణాటక తబ వాటాను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కర్ణాటక రిజర్వాయర్ లల్లో 80 టీఎంసీలకు పైగా నీరు ఉన్నప్పటికీ 3,500 క్యూసెక్కుల నీటిని కూడా వదిలేందుకు ప్రభుత్వం ఇష్టపడట్లేదని విమర్శించారు.
ఇటీవల కేరళలో కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడుకు వరద నీరు వచ్చి చేరుతోందని అయ్యకణ్ణు తెలిపారు. ఈ నీటిని భవానీసాగర్ డ్యామ్కు మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఇక్కడి రాజకీయ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఒకవేళ కర్ణాటక నీటిని విడుదల చేయకపోతే, ఆ రాష్ట్రానికే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications