రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై -ఛీత్కారాలు తప్పడం లేదని వెల్లడి..!
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత, దివంగత సీఎం ఎన్టీఆర్ పెద్దల్లుడు, ఏపీ బీజేపీ ఛీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా పూర్తిగా రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కారంచేడులో జరిగిన ఓ కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టారు.
బాపట్ల జిల్లా కారంచేడులో జరిగిన ఓ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు... భార్య పురందేశ్వరి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారు. తాజా పరిణామాలపై దగ్గుబాటి మాట్లాడుతూ.. రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి ఉదాహరణగా తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలు కూడా వెల్లడించారు.

ఓడరేవులో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి వారికి జీతాలు చెల్లించేలా రిసార్ట్స్ వాళ్లతో మాట్లాడారని, అయితే కొండయ్య డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు వార్తలు రాశారని దగ్గుబాటి తెలిపారు. అలాగే వరద బాధితులకు సాయం చేసేందుకు వైశ్య కమ్యూనిటీ నుంచి విరాళాలు సేకరించే సమయంలోనూ ఇలాంటి వార్తలే రాశారని గుర్తుచేసుకున్నారు.
డబ్బులు ఖర్చు చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామన్నా.. ఆరోపణలు తప్పడం లేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. కారంచేడులో తన ప్రసంగమే రాజకీయంగా చివరిదశని కూడా దగ్గుబాటి ప్రకటించారు. మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications