AP Debts : నిర్మలమ్మ లెక్క ఇదీ- నా లెక్క ఇదీ- ఏపీ అప్పులపై పురందేశ్వరి వివరణ..
ఏపీలో అప్పులపై కేంద్ర ఆర్ధికమంత్రి పార్లమెంటులో చేస్తున్న ప్రకటనలు రాష్ట్రంలో అధికార వైసీపీలో ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్ చేసిన అప్పు కేవలం 1.77 లక్షల కోట్లు మాత్రమేనని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో ప్రకటించడంతో ఇన్నాళ్లూ విపక్షాలు వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శల్లో పస లేదని తేలిపోయింది. అయితే నిర్మలమ్మ చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు.
రిజర్వుబ్యాంకుకు చూపించిన రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై వైసీపీ సర్కార్ ప్రజలకు వివరణ ఇవ్వాలని దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పుల గురించి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ 2019 నాటికి తెదేపా రూ.2,64 లక్షల కోట్లు అప్పులు భారం రాష్ట్రంపై వేసిందని, ఈ భారం క్రమేణా పెరుగుతూ 2023 నాటికి రూ.4.41 లక్షలకు చేరిందని, నాలుగేళ్ల వైకాపా పాలనలో మరో రూ.1.77 లక్షల కోట్లు అప్పుల భారం పడిందని చెప్పారన్నారు.

అయితే తాను ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన అంశానికి, పార్లమెంటులో సీతారామన్గారు ఇచ్చిన సమాధానానికి మధ్య వ్యత్యాసం ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్పై రూ.10.77 లక్షల కోట్లు అప్పుల భారం ఉందని తాను చెప్పానన్నారు. ఇందులో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లు ఉందని అన్నట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్ రిజర్వు బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం చెప్పారని, అనధికారంగా చేసిన అప్పులు గురించి తాను చెప్పానన్నారు.
కార్పొరేషన్లను తాకట్టుపెట్టి రూ.98,928 కోట్లు, రాష్ట్ర ఆస్తుల తనఖా పెట్టి తీసుకున్న 98 వేల కోట్లు, సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా తీసుకున్న రూ.8,900 కోట్లు, ఏపీ ఫైనాన్సియల్ సర్వీసుల ద్వారా తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణం, విద్యుత్ సంస్థల బకాయిలు రూ.20, 384 కోట్లు, సివిల్ సఫ్లైస్ నుంచి తీసుకున్న 35 వేల కోట్లు, లిక్కర్ బాండ్ల ద్వారా తీసుకున్న 8,375 కోట్లు ఉన్నాయన్నారు.
అలాగే చిన్న కాంట్రాక్టర్లకు ఉన్న రూ.71 కోట్ల బకాయిలు, ఉద్యోగులకు ఉన్న రూ.33 వేల కోట్ల బకాయిలు, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్న డిపాజిట్లు 1170 కోట్లు, పబ్లిక్ ఖాతా ఫండ్ల నుంచి తీసుకున్న రూ.26,235 కోట్లు, గ్రామ పంచాయతీల నుంచి దారి మళ్లించిన రూ.8,868 కోట్లు, జెన్కో, ట్రాన్స్కోల నుంచి తీసుకున్న రూ.,3600 కోట్లు జీపిఎఫ్ ఫండ్ నుంచి తీసుకున్న 17 వేల కోట్లు, ఇలా అనధికారంగా తీసుకున్న రుణాలన్నీ కలిపితే మొత్తం 10.77 కోట్లు అప్పులున్నాయని చెప్పానన్నారు. ఈ ప్రకటనకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.
నిన్న పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గూర్చి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలియచేసిన విషయాలు పై పూర్తి వివరణ pic.twitter.com/e94f4MwfF8
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) August 1, 2023
పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు 20 నుంచి నెల వరకు సమాధానం పట్టవచ్చని, తాను రాష్ట్ర అప్పులపై శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని నాలుగు రోజుల క్రితమే కలసి వివరించానన్నారు. పార్లమెంటు సక్రమంగా జరిగి ఉంటే ఈ ప్రశ్నపై చర్చ జరిగి వాస్తవ వివరాలు బయటకు వచ్చేవని, ఎఫ్ఆర్బిఎం విషయంలో రాష్ట్ర ప్రభత్వం చూపిన వివరాలు వాస్తవానికి దగ్గరగా లేవని ఆనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం రూ.40 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉందని చెప్పారు. ఎఫ్ఆర్బిఎం రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని కాని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వుబ్యాంకును పక్క దోవ పట్టించినట్లు కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications