మండలికి పంపిన సీఆర్డీఏ రద్దు,మూడు రాజధానుల బిల్లులపై టీడీపీ మెలిక .. రూల్ 90 క్రింద టీడీపీ నోటీస్
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక రెండోసారి సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో పెట్టి ఆమోదం పొందేలా చూడాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే సీఆర్డీఏ రద్దు బిల్లు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను చర్చించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. ఆ బిల్లులను మండలిలో చర్చించరాదని రూల్ 90 కింద టీడీపీ నోటీసులిచ్చింది.
AP Budget 2020: శాసనసభలో ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే ... ఆసక్తికరంగా సమావేశాలు
బిల్లులు మండలిలో .. చర్చ జరపరాదన్న టీడీపీ ఎమ్మెల్సీలు
సీఆర్డీఏ రద్దు బిల్లు,అధికార వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద నోటీసిచ్చిన టిడిపి ఈ బిల్లులు పాస్ కాకుండా ఉండడానికి శాసనమండలి వేదికగా గట్టిగానే మెలిక పెడుతోంది. ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని,సెలెక్ట్ కమిటీ ముందున్న బిల్లులను మళ్లీ మండలిలో ఎలా ప్రవేశపెడతారని టీడీపీ నోటీసులో పేర్కొంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించ లేదని స్పష్టీకరించింది.
చైర్మన్ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవాలన్న టీడీపీ
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం మండలి ఛైర్మన్ కు ఉందని,మండలి చైర్మన్ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని టిడిపి నోటీసులో స్పష్టం చేసింది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకే పంపాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలిలో బడ్జెట్ పై చర్చ కొనసాగుతోంది. ఇక బడ్జెట్ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ చేపడతామని శాసన మండలి చైర్మన్ షరీఫ్ వెల్లడించారు.
ఇక అసెంబ్లీలో రెండో రోజు కొనసాగిన టీడీపీ వాకౌట్
సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లుగా వాటిపై చర్చ జరపాల్సిందిగా ఆయన సభ్యులకు తెలిపారు. ఇక దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు రూల్ 90 కింద నోటీసులిచ్చి చర్చ జరపడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలలో వైసిపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, టిడిపి నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని టిడిపి వాకౌట్ చేసింది.
Recommended Video
మండలిలో గట్టిగా బిల్లుల విషయంలో టీడీపీ పోరాటం .. సర్వత్రా టెన్షన్
శాసనమండలి మాత్రం టిడిపి అధికార పార్టీపై గట్టిగానే పోరాటం చేస్తుంది. మండలిలో సీఆర్డీఏ రద్దు బిల్లు, అధికార వికేంద్రీకరణ బిల్లులు పాస్ కాకుండా అడ్డుకుని తీరుతామని టిడిపినేతలు తేల్చి చెప్పిన పరిస్థితిలో, ప్రస్తుతం టిడిపి నోటీసు జారీ చేయడం ఉత్కంఠగా మారింది. మరి టీడీపీ నేతల వ్యూహానికి, వైసిపి ప్రతివ్యూహం ఏంటి అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.