AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ సహా..!
ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా అమరావతిలో చేపట్టాల్సిన కీలక నిర్మాణాలు, రాష్ట్రానికి తాజాగా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ప్రాజెక్టులు ఇలా పలు అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. మొత్తం 44 అంశాలకు ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర లభించింది.
అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్ (రాజ్ భవన్)తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేశారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డును 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానించేందుకు వీలుగా చేపట్టే రూ.532 కోట్ల పనులకు ఆమోదం లభించింది. దీంతో పాటు మున్సిపల్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 9500 కోట్లతో చేపట్టే 506 ప్రాజెక్టులకు పాలనా అనుమతులు ఇచ్చారు.

తాజాగా జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో ఆమోదించిన రూ.20444 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా 26 సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే 56 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అలాగే కుప్పంలో ఉన్న పాలేరు నదిపై చెక్ డ్యామ్ ల నిర్వహణకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖకు సంబంధించి తెస్తున్న సవరణ చట్టం ముసాయిదా బిల్లుపైనా కేబినెట్ చర్చించింది. అలాగే గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications