ఇలా ముందుకెళ్దాం: కొత్త జిల్లాలు, అమరావతి పై కేబినెట్ లో కీలక నిర్ణయాలు..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నెలాఖరు కు కొత్త జిల్లాలు అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రతిపాదిత జిల్లాల పైన నోటిఫికేషన్ జారీ చేసింది. అదే విధంగా అమరావతి పైన కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ రోజు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ఆర్దిక సంస్థల కార్యలయాలకు శంకుస్థాపన చేసారు. కాగా, నేటి కేబినెట్ భేటీలో అమరావతి రెండో విడత లాండ్ పూలింగ్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనున్నారు.
ఏపీ కేబినెట్ ఈ మధ్యాహ్నం భేటీ అయింది. పలు కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అవుతుండటంతో ఇక పాలనా పరంగా.. రాజకీయంగా నిర్ణయాలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు పైన నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రక్రియలో ఎక్కడా వివాదాలకు తావు లేకుండా డిసెంబర్ చివరికి ప్రక్రియ పూర్తి చేసేలా బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫి కేషన్ విడుదల చేసింది. జిల్లాల వారీగా ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయాలని జిల్లాల కలెక్టర్లకు సూచిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ నిన్న (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనల్ని 30 రోజుల్లోగా జిల్లా కలెక్టర్లకు అందజేయాలని పేర్కొన్నారు.
డిసెంబరు నెలాఖరులోగా జిల్లాల విభజన ప్రక్రియ పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే విధంగా అమరావతి లో రెండో విడత లాండ్ పూలింగ్ పైన ఇప్పటికే రైతులకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. దీంతో, తాజాగా రెండో విడతలో భాగంగా రాజధాని కోసం మరో 44,676 ఎకరాల భూ సమీకరణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. ఇక.. అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాల పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications