లక్షన్నర ఇన్విటేషన్లు: రాజధాని వేడుకకు సోనియా, సత్య నాదెళ్లకు ఆహ్వానం!
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు 1.50 లక్షల ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని దేశాల రాయబారులు, గవర్నర్లను ఆహ్వానించనుంది.
ఇందుకోసం లక్షన్నర ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందనుంది. అలాగే, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును పిలుస్తారు.
రాజకీయ నాయకులతో పాటు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈవోలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పలకనుంది. రతన్ టాటా, సైరస్ మిస్త్రీ, ముఖేష్ అంబానీ, ప్రేమ్ జీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ఆహ్వాన పత్రాలు పంపించనున్నట్లు సమాచారం.
భారీ క్రీడా గ్రామం
ఏపీ రాజధాని అమరావతిలో ఆటలకూ పెద్దపీట వేయనున్నారు. నూతన రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఓ క్రీడా గ్రామం నిర్మించనున్నారు. ఒలింపిక్స్ కూడా నిర్వహించే స్థాయిలో సౌకర్యాలు ఉండేలా దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
అతిపెద్ద క్రీడా మైదానం నిర్మాణంతో పాటు అన్ని రకాల క్రీడల శిక్షణకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు వీలుగా భూమిని కేటాయించనున్నారు. క్రీడా గ్రామం, మైదానాలు, ఇతర అవసరాల నిర్మాణం కోసం మొత్తంగా సుమారు 1200 ఎకరాలు ఇవ్వనున్నారని సమాచారం. అమరావతిలో అన్ని క్రీడా పోటీలను ఒకేచోట నిర్వహించే స్థాయిలో నిర్మాణాలు ఉండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
గృహ నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష
గృహ నిర్మాణ శాఖ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మృణాళిని, అధికారులు ఉన్నారు. వివిధ దేశాల్లో పరిశీలించిన అంశాలతో అధికారులు చంద్రబాబుకు ప్రజంటేషన్ ఇచ్చారు.
గృహ నిర్మాణంలో ప్రీ ప్యాబ్రికేటెడ్ టెక్నాలజీ వాడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పేదలకు త్వరితగతిన, నాణ్యత గల ఇళ్లు నిర్మించేందుకు సింగపూర్, చైనా విధానాలను అనుసరించాలన్నారు. ఆట స్థలాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులతో టౌన్ షిప్ల నిర్మాణం జరగాలన్నారు.