ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: హైలైట్గా 'యానిమేషన్' పాలసీ..
అమరావతి: సోమవారం సాయంత్రం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నిర్ణయాలను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, భోగాపురం ఎయిర్పోర్టు కోసం 448.88 ఎకరాల భూమిని ఏపీఏడీసీఎల్కు అప్పగించాలన్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
యానిమేషన్ పాలసీ:
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్&కామిక్స్ పాలసీ(2018-2020)కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా యానిమేషన్ సినిమాలకు ప్రత్యేక రాయితీ కల్పించనున్నారు. ఈ మేరకు రూ.5 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉన్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ యానిమేషన్ సినిమాలకు 50 శాతం స్టేట్ జిఎస్టీ రాయితీ కల్పించనున్నట్టు సమాచారం. ఉత్తమ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించినట్టు సమాచారం. యానిమేషన్ రంగం కోసం విశాఖ జిల్లాలో 40ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
నూతన ఆక్వా పాలసీ:
నూతన ఆక్వా పాలసీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కోస్తాలో 9ఆక్వా జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలో నూతన విధానాలు ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తం 40అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.
రుణమాఫీపై కూడా:
కేబినెట్ సమావేశంలో పీఆర్సీ, మూడో విడుత రైతు రుణమాఫీ, కంపెనీల భూ కేటాయింపులకు సంబంధించి సాధ్యాసాధ్యాలు, ప్రభుత్వం రంగ సంస్థలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కేటాయింపుపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
ఇక ఐటీ పాలసీకి తోడు అదనంగా ఎంప్లాయ్మెంట్ రాయితీ కూడా కల్పించనున్నట్టు సమాచారం.సమావేశంలో అగ్రి గోల్డ్ అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ.. కచ్చితమైన వివరాలేవి ఇంకా బయటకురాలేదు.
బీజేపీ చేసిందేమి లేదు: బోండా ఉమా
నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని టీడీపీ మొదటినుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీకి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఓ టీవి ఛానెల్ చర్చా కార్యక్రమంలో భాగంగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల వాటా నుంచి కాకుండా.. ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చిందేంటని బీజేపీని ఉమా ప్రశ్నించారు.
బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, విభజన హామీలన్నిటికీ సానుకూలం అంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. టీవిల్లో, పేపర్లలో స్టేట్మెంట్లు తప్ప బీజేపీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమి లేదన్నారు.