ఎపి పరిపాలనకు టెక్నాలజీ అండ...రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సిఎం
Recommended Video
అమరావతి: పరిపాలనకు టెక్నాలజీని జోడించి ప్రజల చేత మన్ననలను పొందాలనే లక్ష్యంతో నూతన వ్యవస్థను ఆవిష్కరించారు ఎపి సిఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆ సమాచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేశారు. ఎపి సచివాలయంలోని మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు.
హైటెక్ సిఎం..హైటెక్ పరిపాలన
పరిపాలనలో టెక్నాలజీ మేళవించడం ద్వారా హైటెక్ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరొందారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన చేపట్టిన మరో ప్రాజెక్ట్ రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్. దీని ద్వారా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోని అధికారులు, ప్రజలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడవచ్చు.. విపత్తులు, ప్రమాదాల సమయంలో ఈ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ అధికారులు, సహాయ సిబ్బందికి సీఎం ఆదేశాలు ఇవ్వొచ్చు. దీని కోసం 13 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. అంతే కాదు సచివాలయం నుంచి డ్రోన్ల ద్వారా మొత్తం వ్యవస్థను పర్యవేక్షించే అవకాశం ఉంది.
ఆర్ టిజి ఎందుకంటే...
రియల్ టైమ్ గవర్నెన్స్ మెయిన్ సెంటర్ నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై మీడియాలో వచ్చే అన్ని రకాల ఫిర్యాదుల్నీ ఎప్పటికప్పుడు తెలుసుకొని సకాలంలో పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. ఇకపై కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారి వరకు క్షేత్రస్థాయి నుంచే సెల్ఫోన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గోవచ్చన్నారు. రాష్ట్రంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి నెలకొన్నా సమీక్షించి, క్షేత్రస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వొచ్చన్నారు. అలాగే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో పరిశీలించవచ్చని, తద్వారా అధికారుల పనితీరును తెలుసుకోవచ్చన్నారు.
ఆర్ టిజి ప్రయోజనాలు....
మరోవైపు రాష్ట్రంలో వర్షపాతం, భూగర్భ జలాల వివరాలు తెలుసుకోవచ్చని సిఎం తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఎలా ఉందో డ్రోన్ కెమెరాల ద్వారా లోపాల్ని సరిచేయవచ్చన్నారు. అలాగే వివిధ కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షించేందుకు, సైబర్ నేరాల్ని అదుపు చేసేందుకు కూడా ఈ కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలివ్వొచ్చన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఇడి దీపాలు పనిచేస్తున్నదీ లేనిదీ, పెన్షన్, రేషన్ తీసుకున్నారో లేదో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంట్రానెట్ టెక్నాలజీతో పనిచేసే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో ఎలాంటి సాంకేతిక ఆటంకాలూ ఏర్పడే అవకాశం లేదన్నారు. 85 సీట్ల సామర్ధ్యంతో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిబ్బందిని, ఇతర సౌకర్యాల్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 24 పెద్ద తెరలు ఏర్పాటు చేయగా, వాటిని 100 స్క్రీన్లుగా మలుచుకొని అన్ని ప్రాంతాల్నీ పర్యవేక్షించవచ్చని సిఎం తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన 24 గంటల కాల్ సెంటర్ను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించామని ఆర్టిజి సిఇఒ బాబు ఈ సందర్భంగా సిఎంకు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల్ని దీని పరిధిలోకి తీసుకొచ్చామని ఆర్టిజి సిఇఒ బాబు తెలిపారు.