ముంబై వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైకి వెళ్లి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఇటీవల ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు నేరుగా పవన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పవన్ తో కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు, వైద్యులు సూచించిన చికిత్స వివరాలను తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని వైద్యులు చెప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పవన్ పూర్తిగా కోలుకుని త్వరలోనే ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

అయితే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. గతంలో సినిమా షూటింగ్ల సమయంలో ఏర్పడిన గాయాల ప్రభావం కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమైందని ఇటీవల ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ ఆరోగ్య సమస్య తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల బృందం సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది.
కాగా శస్త్రచికిత్స అనంతరం కొద్ది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఫిజియోథెరపీ, వైద్యుల పర్యవేక్షణతో త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇటీవలే పవన్ సైనస్ సమస్యకు కూడా శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications